Chicken Pakoda: సండే స్పెషల్.. చికెన్ పకోడీ.. వేడి వేడిగా అందించండి.. తిన్న వెంటనే వావ్ అంటారు
నాన్ వెజ్ ప్రియులు ఆదివారం వస్తే చాలు చికెన్ , మటన్, రొయ్యలు చేపలు వంటి రకరకాల ఆహారాన్ని తినాలని కోరుకుంటారు. అయితే మాంసాహార ప్రియులలో చికెన్ ప్రియులు వేరు అని చెప్పవచ్చు. చికెన్ తో కూర, వేపుడు, బిర్యానీ, పచ్చడి ఇలా రకరకాల ఆహారాన్ని చేసుకుని తినడానికి ఇష్టపడతారు. అయితే వర్షాకాలంలో వేడి వేడిగా పకోడీలు తినాలిపిస్తే.. చికెన్ పకోడీని ట్రై చేయండి. తిన్న వెంటనే వావ్ అంటారు.
వర్షాకాలం వస్తే చాలు వేడి వేడిగా స్నాక్స్ తినాలని కోరుకుంటారు. అందుకే బజ్జీలు, మొక్కన్న జొన్న పొత్తులు వంటివి తినడానికి ఆసక్తిని చూపిస్తారు. అయితే నాన్ వెజ్ ప్రియులు ఈ స్నాక్స్ గా కూడా మాంసాహారం ఉండాలని కోరుకుంటారు. అటువంటి వారికీ చికెన్ పకోడీలు బెస్ట్ స్నాక్ అని చెప్పవచ్చు. ఈ చికెన్ పకోడీలు ఒక ప్రసిద్ధ భారతీయ చిరుతిండి. ఈ చికెన్ పకోడీలు బయట కరకరలాడుతూ లోపల మెత్తగా మసాలా రుచితో ఉండి ప్రసిద్ధి చెందాయి. ఈ చికెన్ పకోడీలు టీతో లేదా ఏ సందర్భంలోనైనా రుచికరమైన స్నాక్గా వడ్డించవచ్చు. దీనిని తయారు చేయడం సులభం. తక్కువ పదార్థాలతో తయారు చేసుకోవచ్చు. ఈ రోజు చికెన్ పకోడీ తయారీ గురించి తెల్సుకుందాం..
కావాల్సిన పదార్ధాలు:
బోన్ లెస్ చికెన్- 500 గ్రాములు
శనగ పిండి- 1 కప్పు
పెరుగు- 1/2 కప్పు
గుడ్డు- 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూన్
పచ్చిమిర్చి- 1 (సన్నగా తరిగిన)
పసుపు – 1/2 టీస్పూన్
కారం-1 టీస్పూన్
ధనియాల పొడి- 1 స్పూన్
గరం మసాలా- 1/2 స్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
వేయించడానికి నూనె
కరివేపాకు-
కొత్తిమీర -(సన్నగా తరిగినవి)
నిమ్మరసం – సగం చెక్క
తయారీ విధానం:
ముందుగా చికెన్ ను శుభ్రం చేసి.. చిన్న ముక్కలుగా కోసి ఒక గిన్నెలో వేసుకోవాలి.
ఇప్పుడు ఈ చికెన్ లో అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మరసం వేసి బాగా కలపండి.
ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ ను ఒక పక్కకు పెట్టి సుమారు 20 నిమిషాలు అలా ఉంచండి.
వేరే గిన్నె తీసుకుని ఇప్పుడు శనగపిండి, పెరుగు, గుడ్డు, కొంచెం నీరు వేసి బాగా కలిపి.. కొంచెం మందంగా ఉండేలా పిండిని సిద్ధం చేయండి. పిండిలో ఎటువంటి ముద్దలు ఉండకుండా బాగా కలపండి. అంటే గడ్డ పెరుగులా ఉండే విధంగా ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి.. వేయించడానికి సరిపడా నూనె పోసుకుని నూనెను వేడి చేయండి.
మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను పిండిలో ముంచి.. ఈ వేడి నూనెలో వేసి.. చికెన్ బంగారు గోధుమ రంగు వచ్చేవరకు డీప్ ఫ్రై చేయాలి.
ఈ నూనె లో కరివేపాకు వేసి వేయించి తీసుకోండి.
ఇలా తయారుచేసిన పకోడాలను టిష్యూ పేపర్ మీద తీసివేసి, అదనపు నూనెను తొలగించుకోండి. తర్వాత కొత్తిమీర, వేయించిన కరివేపాకుతో అలంకరించి.. వేడి టీతో సర్వ్ చేయండి.