
ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు భాగ్యనగరంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భక్తి పారవశ్యం వెల్లివిరుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలు అమ్మవారి నామస్మరణతో మారుమోగిపోతాయి. ఊరూ వాడా ఏకమై శక్తి స్వరూపిణి అయిన గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం తెలుగువారికి మాత్రమే సొంతమైన ఒక అరుదైన, విశిష్టమైన సంస్కృతి. ఇంతకీ బోనం అంటే ఏమిటి? అందులో ఏముంటుంది..? ఇప్పుడు చూద్దాం..
భోజనం అనే సంస్కృత శబ్దానికి వికృతి రూపమే బోనం. జగజ్జనని అయిన అమ్మవారికి మన ఇంట్లోనే భోజనం తయారుచేసి నివేదించే ఈ అద్భుతమైన సంప్రదాయం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. తమను, తమ కుటుంబాలను, ఊరిని ఎలాంటి ఆపదలు, రోగాలు రాకుండా చల్లగా చూడాలని కోరుకుంటూ భక్తులు ఈ పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఇలా అమ్మవారికి సమర్పించే బోనాన్ని ఎంతో నిష్ఠతో, పరిశుభ్రతతో తయారుచేస్తారు. ఈ భోనాలు అనేక రకాలుగా తయారు చేస్తారు. కొందరు బెల్లం బువ్వ బోనం చేస్తే, మరికొందరు పచ్చబువ్వతో బోనం వండుతారు. కోరిన కోర్కెలు తీరిన కొందరు అమ్మవారికి వెయ్యి కండ్ల బోనం సమర్పించుకుంటారు.
ఇందుకోసం రాగి లేదా మట్టి కుండను ముందుగా అందులో నైవేధ్యం వండుతారు. దీన్ని కొందరు బెల్లంతో పరమాన్నం వండుతారు.. మరికొందరు పసుపు వేసి పచ్చటి అన్నం వండుతారు. అనంతరం ఆ పాత్ర పై భాగాన్ని నీటితో శుభ్రం చేస్తారు. ఇప్పుడు దానికి తెల్ల సున్నం, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, వేపాకులు, పూలతో అందంగా అలంకరిస్తారు. ఇవి రెండు పాత్రలు ఉంటాయి. అడుగున ఉన్న దాంట్లో ముందుగా బెల్లంతో వండిన అన్నం పరమాన్నం, కట్టె పొంగలి లేదంటే పసుపు వేసి వండిన అన్నంలో అమ్మవారికి ఇష్టంగా చెప్పుకునే పొన్నగంటి ఆకు కూర వండి పెడతారు. ఇక ఆ పైన మరో చిన్న పాత్రను పెడతారు. ఇందులో బెల్లం షాక లేదంటే పెరుగుతో నింపుతారు.
ఇక ఇలా సిద్ధం చేసిన కుండ పైభాగంలో రెండు మట్టి ప్రమీదలు పెట్టి దీపం వెలిగిస్తారు. ఇక్కడ గండ దీపం ప్రత్యేకం. అగరవత్తులు వెలిగించి ధూపం సమర్పిస్తారు. ఇక ఆడబిడ్డలు, ఇంటి కొడళ్లు పట్టుబట్టలు కట్టుకుని అందంగా ముస్తాబై బోనం తలపై ధరించి అమ్మవారి సన్నిధికి బయల్దేరుతారు. మంగళహారతులు, పోతురాజుల విన్యాసాలు, డప్పుల దరువుల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్తారు. ఇక వెయ్యి కండ్ల బోనం కేవలం మట్టి పాత్రతో మాత్రమే తయారు చేస్తారు. ఎందుకంటే.. ఈ కుండ నిండుగా రంధ్రాలతో తయారు చేయబడి ఉంటుంది. ఒంటి నిండా రంద్రాలతో ఉన్న ఆ కుండను పసుపు, కుంకుమలతో అలంకరించి లోపల దీపం వెలిగిస్తారు.
తెలంగాణ ప్రాంతాల్లో ఆషాఢ మాసంలో ఈ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. హైదరాబాద్లో గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలతో ప్రారంభమై, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా మాతంగేశ్వరి బోనాలతో ముగుస్తాయి. ఆ తరువాత గ్రామాల్లో శ్రావణ మాసం బోనాల వేడుకల ప్రారంభమవుతుంది. ఇలా ఆషాఢం, శ్రావణం రెండు నెలల పాటు తెలంగాణ వ్యాప్తంగా అమ్మవార్లను కొలుస్తూ బోనాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తోంది.
మన సంస్కృతి, ఐక్యత, భక్తిభావాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ, తరతరాల నుండి మన సాంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్న ఒక గొప్ప ఉత్సవం. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షిద్దాం.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..