Lok Sabha Election: ఎన్నికల సమరంలో.. తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల్లో వివిధ పార్టీలు తమ తరఫున ప్రచారం కోసం ప్రజల్లో ఆదరాభిమానాలు ఎక్కువగా ఉన్న సినీ తారలు, పేరొందిన క్రీడాకారులను ఉపయోగించుకుంటూ ఉంటారు. వారిని అభిమానించే ప్రజలను ప్రభావితం చేసి, తమ ఓటర్లుగా మార్చుకోవచ్చు అని ఆయా పార్టీలు భావిస్తూ ఉంటాయి. ఇది కొత్త విషయమేమీ కాదు.
ఎన్నికల్లో వివిధ పార్టీలు తమ తరఫున ప్రచారం కోసం ప్రజల్లో ఆదరాభిమానాలు ఎక్కువగా ఉన్న సినీ తారలు, పేరొందిన క్రీడాకారులను ఉపయోగించుకుంటూ ఉంటారు. వారిని అభిమానించే ప్రజలను ప్రభావితం చేసి, తమ ఓటర్లుగా మార్చుకోవచ్చు అని ఆయా పార్టీలు భావిస్తూ ఉంటాయి. ఇది కొత్త విషయమేమీ కాదు. సినీ రంగంలో వెలుగువెలిగిన నటులు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ఈ ట్రెండ్ ఉత్తరాది కంటే దక్షిణాది రాష్ట్రాల్లో అధికంగా ఉంది. తమిళనాట కొన్ని దశాబ్దాలుగా సినీ రంగం, రాజకీయ రంగం కలగలసి ప్రయాణం సాగిస్తోంది. డీఎంకే, అన్నాడీఎంకే, ఎండీఎంకే.. ఇలా ఒకటేమిటి.. ఆ రాష్ట్రంలోని ప్రతి రాజకీయ పార్టీకి సినీ తారలతో సంబంధాలున్నాయి. సినిమాల నుంచి రాజకీయాల్లోకి, రాజకీయ కుటుంబాల నుంచి సినిమాల్లోకి ప్రయాణాలు.. తారలు నేతలుగా.. నేతలు తారలుగా మారిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది. 80వ దశకంలో నందమూరి తారక రామారావు సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి అనేక మంది తారలు నేతలుగా మారారు. ఆ తర్వాతి కాలంలో మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు పవర్ స్టార్గా పేరొందిన పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో ఉన్నారు. కర్ణాటకలో అంబరీష్ వంటి తారలు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవారే. కొందరు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని జనం ఓట్లతో గెలిచి చట్టసభల్లో అడుగు పెడితే.. మరికొందరు పరోక్షంగా ఆయా రాజకీయ పార్టీలకు సహాయం చేసి, ప్రతిఫలంగా పెద్దల సభ ద్వారా పార్లమెంటులోకి అడుగుపెట్టినవారున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న సినీ-రాజకీయ రంగాల మైత్రికి కొనసాగింపుగా.. ఇప్పుడు ఉత్తరాదిన ప్రధాన రాజకీయ పార్టీలు సినీ తారల గ్లామర్ను తమ పార్టీలకు జోడిస్తున్నాయి.
ఓటర్లను ఆకట్టుకుని పార్టీని విజయ శిఖరాలపై కూర్చోబెట్టేందుకు వివిధ పార్టీలు సినీ తారలు, క్రీడాకారులపై ఆధారపడుతున్నాయి. వారితో ప్రచారం చేయించుకోవడం కోసం కాదు, వారికి టికెట్లు ఇచ్చి మరీ గెలుపొందాలని చూస్తున్నాయి. వివిధ రంగాల్లో ఉంటూ ఆయా పార్టీలకు అనుకూలంగా వ్యవహరించినవారికి ఈ అవకాశాలు దక్కుతున్నాయి. ఆ కోవలో బాలీవుడ్ నటీమణి కంగన రనౌత్ ఒకరు. తన వ్యాఖ్యలు, కామెంట్లతో నిత్యం వార్తల్లో ఉండే కంగన, దేశభక్తిని ప్రదర్శించే విషయంలో ఏమాత్రం వెనుకాడరు. దేశభక్తి కథాంశాలతో తీసిని సినిమాలు సైతం ఉన్నాయి. సాధారణంగా సినీరంగంలో వెలుగు వెలుగి, చివరి దశలో.. అవకాశాలు తగ్గినప్పుడు రాజకీయాల్లోకి రావడం సహజం.
కానీ కంగన విషయంలో అలా కాదు. బాలీవుడ్లో వెలుగు వెలుగుతున్న స్థితిలో ఉన్న ఆమెను భారతీయ జనతా పార్టీ (BJP) హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. కొన్ని తరాల క్రితం వెలుగువెలిగిన నటీమణి హేమమాలిని ఎలాగూ బీజేపీలోనే ఉన్నారు. ‘రేసు గుర్రం’ సినిమాలో ‘మద్దాలి శివారెడ్డి’ క్యారక్టర్తో తెలుగు ప్రజలకు సుపరిచితుడైన రవికిషన్ సైతం మరోసారి బీజేపీ తరఫున బరిలోకి దిగుతున్నారు. ఒకప్పుడు దూరదర్శన్లో ప్రసారమైన రామాయణం సీరియల్ ద్వారా దేశంలోని అందరికీ రాముడి క్యారక్టర్ ద్వారా సుపరిచితుడైన అరుణ్ గోవిల్ను బీజేపీ ఉత్తర్ప్రదేశ్లోని మీరట్ నుంచి బరిలోకి దించింది. కేవలం సినీ తారలే కాదు, పారా ఒలింపిక్స్లో పతకాలు సాధించిన దేవేంద్ర జంఝారియాను రాజస్థాన్లోని చురు నుంచి అభ్యర్థిగా ప్రకటించింది.
సెలబ్రిటీలను బరిలోకి దించడంలో కేవలం బీజేపీ మాత్రమే కాదు, తృణమూల్ కాంగ్రెస్ కూడా పోటీ పడుతోంది. గతంలో బీజేపీలో ఉండి ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్లో చేరిన శతృజ్ఞ్ సిన్హాను అసన్సోల్ నుంచి తృణమూల్ అధినేత్రి మమత బరిలోకి దించుతున్నారు. అలాగే 1983లో వరల్డ్ కప్ గెలుచుకున్న క్రికెట్ జట్టు ఆటగాడు కీర్తి ఆజాద్కు బర్దమాన్-దుర్గాపూర్ స్థానం, యూసుఫ్ పఠాన్కు బరంపూర్ స్థానం నుంచి టికెట్లు కేటాయించింది. రచన బెనర్జీ హూగ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. బెంగాలీ సూపర్స్టార్, 2 పర్యాయాలు ఎంపీగా పనిచేసిన దేవ్ మరోసారి మేదినీపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందినవారిలో మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి నవనీత్ కౌర్ రాణాతో పాటు కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గం నుంచి సుమలత ఉన్నారు. ఈ ఇద్దరూ ఆ తర్వాత బీజేపీకి మద్దతు తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బీజేపీ తరఫున పోటీలోని ప్రముఖులు:
- మండి – కంగనా రనౌత్
- మీరట్ – అరుణ్ గోవిల్
- మధుర – హేమమాలిని
- గోరఖ్పూర్ – రవి కిషన్
- ఈశాన్య ఢిల్లీ – మనోజ్ తివారీ
- అజంగఢ్ – దినేష్ లాల్ యాదవ్ (నిరాహువా)
- త్రిసూర్ – సురేష్ గోపి
- విరుదునగర్ – రాధిక శరత్కుమార్
- చురు – దేవేంద్ర ఝజహారియా
- హుగ్లీ – లాకెట్ ఛటర్జీ
- మేదినీపూర్ – అగ్నిమిత్ర పాల్
తృణమూల్ కాంగ్రెస్ తరఫున బరిలోని సెలబ్రిటీలు:
- బహ్రంపూర్ – యూసుఫ్ పఠాన్
- బర్ధమాన్-దుర్గాపూర్ – కీర్తి ఆజాద్
- అసన్సోల్ – శత్రుఘ్న సిన్హా
- జాదవ్పూర్ – సయోని ఘోష్
- బీర్భూమ్ – సతాబ్ది రాయ్
- బరాక్పూర్ – పార్థ భౌమిక్
- హుగ్లీకి – రచనా బెనర్జీ
- మేదినీపూర్ నుండి దేవ్