ఆ పానెల్ లోని ఇతర సభ్యులను తొలగించండి, సుప్రీంకోర్టును కోరిన రైతు సంఘం, అఫిడవిట్ సమర్పణ

తమ డిమాండ్ల సమస్యపై తలెత్తిన సంక్షోభ పరిష్కారానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలోని మిగతా ముగ్గురు సభ్యులను తొలగించాలని భారతీయ కిసాన్ యూనియన్..

ఆ పానెల్ లోని ఇతర సభ్యులను తొలగించండి, సుప్రీంకోర్టును కోరిన రైతు సంఘం, అఫిడవిట్ సమర్పణ
Supreme Court
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 17, 2021 | 9:29 AM

తమ డిమాండ్ల సమస్యపై తలెత్తిన సంక్షోభ పరిష్కారానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలోని మిగతా ముగ్గురు సభ్యులను తొలగించాలని భారతీయ కిసాన్ యూనియన్ లోక్ శక్తి కోరింది. ఈ మేరకు కోర్టుకు  ఓ అఫిడవిట్ ను సమర్పించింది. పరస్పర సామరస్య ప్రాతిపదికపై తమతో చర్చించే వారితో కూడిన కమిటీని నియమించాలని ఈ సంఘం అభ్యర్థించింది. సుప్రీంకోర్టు మొదట ఏర్పాటు చేసిన పానెల్ లోని నలుగురు సభ్యుల్లో ఒకరైన భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ భూపేందర్ సింగ్ మాన్ ఇందులో నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కమిటీలో ఉన్న ముగ్గురు సభ్యులూ రైతు చట్టాలకు అనుకూలురేనని, వారితో తాము చర్చించే ప్రసక్తే లేదని రైతు సంఘాలు ఇదివరకే స్పష్టం చేశాయి. ఈ నెల 26 న జరిగే ట్రాక్టర్ ర్యాలీని, రైతుల నిరసనను అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ పోలీసుల తరఫున కేంద్రం ఓ ఇంజంక్షన్ ను దాఖలు చేసిన నేపథ్యంలో దీన్ని కొట్టివేయాలని కూడా సుప్రీంకోర్టును ఈరైతు సంఘం అభ్యర్థించింది. ఈ ఇంజంక్షన్ పైన, ఈ అఫిడవిట్ పైన కోర్టు సోమవారం విచారణ జరపనుంది. తాము నియమించిన కమిటీ నుంచి మాన్ నిష్క్రమించడంపై కూడా అత్యున్నత న్యాయస్థానం దృష్టి సారించనుంది.

ఇక కేంద్రంతో తాడోపేడో తేల్చుకొవాలనే నిశ్చయంతో ఉన్న రైతు సంఘాలు ఈ నెల 26 న ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించాలనే దాదాపు నిర్ణయించాయి. సిఖ్ ఫర్ జస్టిస్ అనే సంస్థ కూడా ఈ సంఘాలతో చేతులు కలిపింది. దీంతో ఈ రైతుల నిరసనలో ఖలిస్తానీల జోక్యం ఉందా అని జాతీయ దర్యాప్తు సంస్థ భావిస్తోంది. సిఖ్ ఫర్ జస్టిస్ సంస్థను ఇదివరకే నిషేధించారు.