ఏపీలో వ్యవసాయ పరికరాలపై 40 శాతం సబ్సిడీ

|

Aug 01, 2020 | 5:00 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 40 శాతం రాయితీపై వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ సహకార బ్యాంకు ఆర్ధిక సహకారంతో ఈ సంఘాలు పరికరాలను సమకూర్చుకునే వెసులుబాటును కల్పించింది.

ఏపీలో వ్యవసాయ పరికరాలపై 40 శాతం సబ్సిడీ
Follow us on

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 40 శాతం రాయితీపై వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ సహకార బ్యాంకు ఆర్ధిక సహకారంతో ఈ సంఘాలు పరికరాలను సమకూర్చుకునే వెసులుబాటును కల్పించింది. వ్యవసాయ పనిముట్ల విలువలో 10 శాతం నిధులను సంఘాలు సమకూర్చుకుంటే, బ్యాంకులు 50 శాతం రుణాన్ని మంజూరు చేస్తాయి. ఇక, మిగిలిన 40 శాతం రాయితీని ప్రభుత్వం అందించనుంది. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయపరికరాల పంపిణీలో జరిగిన అక్రమాలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక మార్పులు, చేర్పులు చేసి కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది. ముఖ్యంగా వ్యవసాయరంగంలో యాంత్రీకరణను ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తొలిదశలో భాగంగా ఆప్కాబ్‌ పేర్కొన్న సంఘాలకు రాయితీపై పరికరాల పంపిణీకి నిధులు కేటాయించనుంది. ఈ మేరకు శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేసింది.

మార్గదర్శకాలు ఇవే:
# ఆసక్తికలిగిన రైతులు ఈనెల 15లోగా సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు.
# రైతు సంఘాలను గ్రామస్ధాయి కమిటీలు గుర్తించాల్సి ఉంటుంది.
# వ్యవసాయ పరికరాల కొనుగోలుకు దరఖాస్తు చేసుకునే సంఘాలు గతంలో ఏ బ్యాంకులోనూ రుణ ఎగవేతదారుగా ఉండకూడదు.
# కనిష్టంగా రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షలు, గరిష్టంగా రూ. 1.20 కోట్ల నుంచి రూ. 1.30 కోట్లను ఆప్కాబ్‌ రుణంగా మంజూరు చేయనుంది.
# గ్రూపులకు వ్యవసాయ యాంత్రిక పరికరాలను సరఫరా చేసిన తరువాతనే, ఉత్పత్తిదారులకు రాయితీ మొత్తాలను ప్రభుత్వం జమ చేయనుంది.
# తొలి దశలో భాగంగా ఈ ఏడాది ఒక గ్రామంలో ఒక సంఘానికే మాత్రమే రాయితీపై రుణం అందించనుంది.
# గ్రూపులు తమకు అవసరమైన యాంత్రిక పరికరాలను ఎంపిక చేసుకునేందుకు ఉత్పత్తిదారులతో మండల, జిల్లాస్ధాయిలో ప్రదర్శనలు ఏర్పాటు కానున్నాయి.
# వ్యవసాయ యంత్రాల ప్రదర్శనను రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల నాలుగో వారం నుంచి వచ్చేనెల 2 వారం వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
# యాంత్రిక పరికరాలను రాయితీపై పొందిన గ్రూపులు.. కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసుకుని అక్కడి ఇతర రైతులకు ఆ పరికరాలను అద్దెకు ఇచ్చుకోవచ్చు. ఈ మేరకు రుణ సదుపాయాలకు సంబంధించిన మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.