Jagan letter కేంద్రానికి జగన్ లేఖాస్త్రం.. మేటర్ ఇదే
కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. కరోనా ప్రబలిన ప్రస్తుత తరుణంలో తప్పనిసరిగా చేయాల్సిన ఓ పనిని గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి లేఖాస్త్రం సంధించారు.
AP Chief Minister Jagan writes letter to Union Minister Jayshankar: కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. కరోనా ప్రబలిన ప్రస్తుత తరుణంలో తప్పనిసరిగా చేయాల్సిన ఓ పనిని గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి లేఖాస్త్రం సంధించారు. విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అంశాలను జగన్ తన లేఖలో పేర్కొన్నారు.
విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రమణ్యం జైశంకర్కు లేఖ రాసిన ముఖ్యమంత్రి వైయస్.జగన్.. కువైట్లో చిక్కుకుపోయిన ఏపీ వలస కార్మికులను స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన విమానాలు ఏర్పాటు చేయాలని కోరారు. వలస కార్మికుల కోసం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతికి నేరుగా విమానాలు ఏర్పాటు చేయాలని జగన్ కేంద్రమంత్రిని కోరారు. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయలను వెనక్కి రప్పించేందుకు ‘వందే భారత్’ మిషన్ పేరుతో మీరు చేపడుతున్న చర్యలు బావున్నాయంటూనే.. ఏపీ కోసం కొన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.
గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోల్పోయి, అక్కడే చిక్కుకు పోయిన వేలాది వలస కార్మికులు కూడా స్వదేశానికి తిరిగి రావడానికి ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని, అలాంటి వారిలో ఏపీకి చెందిన వారు వేలాదిగా వున్నారని, వారంతా స్వదేశానికి రావడానికి అయ్యే ప్రయాణ ఖర్చు భరించే స్థితిలో లేరని వివరించిన ఏపీ ముఖ్యమంత్రి.. వారి కోసం కేంద్రమే ప్రత్యేక విమానాలను నడిపించాలని కోరారు. కువైట్లో ఆమ్నెస్టీ ద్వారా స్వదేశానికి రావడానికి అనుమతి పొందిన సుమారు 2500 మంది వలస కూలీలు వారి ప్రయాణ ఛార్జీలు చెల్లించలేని స్ధితిలో ఉన్నారని తెలిపారు.
ఇమ్మిగ్రేషన్ రుసుము మాఫీ చేయడంతో ద్వారా మన దేశ రాయబార కార్యాలయం, వారందరికీ ఎగ్జిట్ క్లియరెన్స్ కూడా ఇచ్చిందని, మరోవైపు వారి ప్రయాణ ఖర్చును భరించడానికి కువైట్ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని, ప్రస్తుతం వారంతా అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో తలదాచుకుంటున్నారని, కనీస సదుపాయాలు కూడా లేకుండా రెండు వారాల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతూ, స్వదేశానికి తిరిగి రావాలని ఆశతో ఎదురు చూస్తున్నారని జగన్ తన లేఖలో పేర్కొన్నారు.
కువైట్ హైకమిషనర్కు అవసరమైన ఆదేశాలను జారీ చేయడం ద్వారా అక్కడి అధికారులతో మాట్లాడి.. కువైట్ నుంచి రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతికి నేరుగా విమానాలు ఏర్పాటు చేసేలా చూడాలని సీఎం కేంద్ర మంత్రిని కోరారు. వలస కూలీలందరినీ ఇక్కడ సొంత రాష్ట్రంలో రిసీవ్ చేసుకుని, వారికి అవసరమైన వైద్య పరీక్షలు చేయడం, క్వారంటైన్కు పంపించడంతో పాటు, అన్ని సదుపాయాలతో తమ ప్రభుత్వం రెడీగా వుందని తెలిపారు.