కాపురంలో చిచ్చుపెట్టిన వేరు కుంపటి.. దంపతుల ఆత్మహత్య

హాయిగా సాగిపోతున్న కాపురాలను చేజేతులా కూల్చుకుంటున్నారు. అత్తారింటి పోరు భరించలేనంటూ వేరు కాపురం పెట్టిన మూన్నాళ్లకే భార్య, భర్తలిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కావడం విశేషం.

కాపురంలో చిచ్చుపెట్టిన వేరు కుంపటి.. దంపతుల ఆత్మహత్య
Follow us

|

Updated on: Sep 03, 2020 | 1:22 PM

పచ్చనికాపురంలో చిన్నపాటి గొడవ చిచ్చుపెట్టింది. అలుమగల మధ్య మనస్పర్థలు రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. కలహాల్లో కాపురాలు కొట్టుకుపోతున్నాయి. ఇద్దరి మధ్య ఆవేశాలు పరాకాష్టకు చేరి దారుణాలకు తెగబడుతున్నారు. భర్తో, భార్యో చేసే తప్పులు.. ఆ కుటుంబాలకు శాపాలుగా మిగులుతున్నాయి. వారి బిడ్డలను అనాధలను చేస్తున్నాయి. హాయిగా సాగిపోతున్న కాపురాలను చేజేతులా కూల్చుకుంటున్నారు. అత్తారింటి పోరు భరించలేనంటూ వేరు కాపురం పెట్టిన మూన్నాళ్లకే భార్య, భర్తలిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కావడం విశేషం. ఈ విషాద ఘటన హైదరాబాద్ మహానగరంలో జరిగింది.

సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడలో ఇద్దరి మధ్య గొడవల కారణంగా భార్యభర్తల ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లాకు చెందిన వెంకటేష్, బార్గవి దంపతులు అంబర్ నగర్‌లో అద్దెకు ఉంటున్నారు. వీరికి పెళ్లి జరిగి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. భార్గవి పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తుండగా.. భర్త వెంకటేష్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో ఏఈగా పనిచేస్తున్నాడు. అయితే, భార్గవికి, అత్తామామలకు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో భార్గవి అత్తామామల నుంచి దూరంగా భర్తతో కలిసి వేరుకాపురం పెట్టింది.

ఇదిలావుండగా, తల్లిదండ్రుల నుంచి దూరంగా వచ్చినందుకు వెంకటేష్.. భార్గవిల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. ఇదే క్రమంలో బుధవారం ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్గవి బాత్రూంలోని వెంటిలేటర్‌కు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అది చూసిన వెంకటేష్ కూడా బెడ్ రూంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ప్రాణం తీసుకున్నాడు. దీంతో స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. భార్గవి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.