ఏపీఎస్ఆర్టీసీలో “ఫేక్ దందా”…విచారణలో బయట పడుతున్న నిజాలు
ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాల పేరిట మరో మోసం వెలుగు చూసింది. ఆర్టీసీ కృష్ణా రీజియన్ పరిధిలో రెగ్యులర్ టైమ్స్కేల్ బేస్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసానికి తెరలేపారు....
fake aprtc jobs in vijayawada : ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాల పేరిట మరో మోసం వెలుగు చూసింది. ఆర్టీసీ కృష్ణా రీజియన్ పరిధిలో రెగ్యులర్ టైమ్స్కేల్ బేస్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసానికి తెరలేపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో ఓ యూనియన్ నేత అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారినట్లుగా తెలుస్తోంది. ఫేక్ ఆర్డర్లు, ఫేక్ ఐడీలు కూడా సిద్ధం చేసి మొసానికి తెరలేపారు. అనుమానం వచ్చిన బాధితులు.. నిలదీయడంతో ఈ ఫేక్ దందా వెలుగులోకి వచ్చింది.
వెలుగులోకి వీడియోలు..
ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో, ఆడియో టేపులు వెలుగులోకి రావటంతో, అధికారులు అప్రమత్తమై ఈ ఫేక్ దందాపై విచారణ జరుపుతున్నారు. ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు ఇప్పటికే అంతర్గత విచారణ ప్రారంభించారు. ఈ దందా ఏడాది క్రితమే జరిగినట్టు తెలుస్తోంది. ఉద్యోగాల పేరుతో తయారు చేసిన ఫేక్ ఆర్డర్ను గత ఏడాది ఫిబ్రవరిలో ముద్రించినట్లుగా తెలుస్తోంది.
ఏడాది క్రితమే…
ఏడాది కాలంగా అత్యంత రహస్యంగా ఉన్న ఈ వ్యవహారాన్ని బాధితులు కొందరు వాట్సాప్ ద్వారా బయట పెట్టడంతో ఫేక్ దందా వెలుగులోకి వచ్చింది. ఈ ఫేక్ ఆర్డర్ కంటే ముందుగానే డబ్బులు వసూలు చేసి.. అభ్యర్థులకు ఫేక్ ఐడీ కార్డులు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తోంది.
సూత్రదారి ఓ యూనియన్ లీడర్..
సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చిన వీడియోను పరిశీలించిన అధికారలు ఇతను ఓ యూనియన్కు చెందిన లీడర్ గా గుర్తించారు. ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని కొంతమందిని ఓ యూనియన్ నేత మభ్య పెట్టాడు. ఆయన మాటలను విశ్వసించిన 34 మంది.. లక్షల రూపాయలు ముట్టజెప్పుకున్నారు. ఇలా వసూలు చేసిన మొత్తం దాదాపు రూ.కోటికి పైగానే ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.