కొత్త వైరస్ కరోనాకు పాతపద్ధతిలో ట్రీట్‌మెంట్..!

|

Mar 15, 2020 | 8:36 PM

కరోనా వైరస్‌ను ఎదుర్కొగల వాక్సిన్లు, యాంటివైరల్ మందులు లేని ప్రస్తుత పరిస్థితుల్లో పరిశోధకులు కొత్త ఆశను కలిగిస్తున్నారు. ఆ వ్యాధి బారి నుంచి కోలుకున్నవాళ్ల రక్తంలో కరోనా తీవ్రత తగ్గించేందుకు, చికిత్స అందించే కీలకమైన...

కొత్త వైరస్ కరోనాకు పాతపద్ధతిలో ట్రీట్‌మెంట్..!
Follow us on

కొవిడ్-19 భూతం ప్రపంచ దేశాలపైబడి కరాళనృత్యం చేస్తోంది. అన్నీ రంగాలను పట్టి పీడిస్తోంది. ఎక్కడో చైనాలోని వుహన్‌లో గతేడాది డిసెంబర్ లో మొదటగా వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ చాపకింద నీరులా దాదాపు 150 దేశాలకు పాకింది. వ్యాక్సిన్ లేని ఈ భయంకరమైన వైరస్ కారణంగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6వేలమంది ప్రాణాలు కోల్పోగా, వేల సంఖ్యలో బాధితులు చికిత్స పొందుతున్నారు. వైరస్‌ను ఎదుర్కొగల వాక్సిన్లు, యాంటివైరల్ మందులు లేని ప్రస్తుత పరిస్థితుల్లో పరిశోధకులు కొత్త ఆశను కలిగిస్తున్నారు. ఆ వ్యాధి బారి నుంచి కోలుకున్నవాళ్ల రక్తంలో కరోనా తీవ్రత తగ్గించేందుకు, చికిత్స అందించే కీలకమైన అంశం ఉందని అంటున్నారు జాన్స్ హాప్ కిన్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు.

కరోనాను ఎదుర్కోనే మందు కన్వాలెసెంట్ సీరమ్ లో ఉందని అంటున్నారు. వైరస్ వల్ల ఇన్ ఫెక్ట్ అయిన వాళ్ల రక్తం నుంచి తీసిన సీరమ్ నే కన్వాలెసెంట్ సీరమ్ అంటారు. రక్తంలోని ప్లాస్మాలో ఉండే పదార్థమే సీరమ్. దీనిలోనే మన యాంటీబాడీలు ఉంటాయి. వైరస్ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు దానితో పోరాడడానికి యాంటిబాడీలు ఈ సీరమ్ లోనే విడుదల అవుతాయి. అందుకే కరోనా నుంచి కోలుకున్న వాళ్ల సీరమ్ నుంచి వైరస్ కు వ్యతిరేకంగా పోరాడగలిగే యాంటిబాడీల ద్వారా ఈ వ్యాధికి చికిత్స అందించవచ్చన్నది పరిశోధకుల భావన.

1918లో స్పానిష్ ఫ్లూ… కరోనా లాగే అంటువ్యాధిగా పుట్టుకొచ్చింది. అప్పుడు ఆ వ్యాధి నుంచి కోలుకున్న వాళ్ల రక్తంలోని అంశాలను ఎక్కించడం వల్ల తీవ్రస్థాయి అనారోగ్యంతో ఉన్న రోగుల మరణాలు 50 శాతానికి పడిపోయాయి. కొన్ని దశాబ్దాల క్రితం తట్టు, పోలియో లాంటి వ్యాధులను అరికట్టడంలో కూడా ఈ పద్ధతినే ఉపయోగించారు. అయితే 1950లలో ఆధునిక వ్యాక్సిన్లు, యాంటివైరల్ మెడిసిన్స్ డెలవలప్ అయిన తర్వాత ఈ తరహా చికిత్స మరుగున పడిపోయిందని జాన్స్ హాప్ కిన్స్ యూనివర్సిటీ…మాలిక్యులర్ మైక్రోబయాలజీ, ఇమ్యునాలజీ విభాగానికి చెందిన డాక్టర్ అర్ టురో కెసాడ్వాల్ చెప్పారు. ఇప్పుడు కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో మళ్లీ ఈ చికిత్సను అభివృద్ధి చేయడం మంచి ఫలితాలను ఇవ్వగలదని ఆయన తెలిపారు. ఆ కాలంలో ఏ వ్యాక్సిన్లూ లేవు. కాని వ్యాధి నిరోధక వ్యవస్థ నుంచి తీసుకున్న కణాలే ఆయా సూక్ష్మజీవుల అంతు చూశాయి. ఇప్పుడు కూడా కరోనాకు ఎటువంటి మందులూ, వ్యాక్సిన్లూ అందుబాటులో లేవు. కాబట్టి ఆ చికిత్స ఇప్పుడు ఉపయోగపడుతుందంటున్నారు.