అమెరికాలో కరోనా కరాళనృత్యం.. 24 గంటల్లో 4,491 మంది మృతి..
కోవిద్-19 మహమ్మారి వికృతరూపం దాల్చింది. ఈ వరస దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. అమెరికాలో ఈ వైరస్ కరాళనృత్యం చేస్తోంది. గత 24 గంటల్లో ఏకంగా 4,491 మంది ఈ వైరస్ ధాటికి బలయ్యారు.
కోవిద్-19 మహమ్మారి వికృతరూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. అమెరికాలో ఈ వైరస్ కరాళనృత్యం చేస్తోంది. గత 24 గంటల్లో ఏకంగా 4,491 మంది ఈ వైరస్ ధాటికి బలయ్యారు. దీంతో అమెరికాలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 34,562కి చేరింది. వైరస్ మొదలైన నాటి నుంచి ఇంతమంది ఒకే రోజు మరణించడం ఇదే తొలిసారి. అయితే, గురువారం వెల్లడించిన మృతుల సంఖ్యలో కరోనా అనుమానిత మరణాలను కూడా కలిపి లెక్కించడం గమనార్హం. నిన్నటి నుంచే అనుమానిత మరణాలను కూడా కరోనా మృతుల కింద పరిగణించడంతో ఒకేసారి భారీగా మరణాల సంఖ్య పెరిగింది.
కాగా.. న్యూయార్క్ నగర యంత్రాంగం కూడా ఈవారంలో 3,778 అనుమానిత కేసుల్ని కరోనా మృతులుగా పరిగణిస్తామని వెల్లడించింది. అమెరికాలో మొత్తం బాధితుల సంఖ్య 6,75,243కు పెరగడంతో గత రెండు రోజుల్లోనే రికార్డు స్థాయిలో మరణాలు సంభవించాయి. 22,170 కరోనా మరణాలతో ఇటలీ రెండో స్థానం.. 19,516 స్పెయిన్ మూడు, 17,920 ఫ్రాన్స్ నాలుగో స్థానంలో నిలిచాయి. అలాగే అమెరికాలో వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువైన న్యూయార్క్ రాష్ట్రంలోనే అత్యధికంగా 12 వేల మంది మృతిచెందారు.