సుశాంత్ మరణాన్ని ఎన్నికల కోసం వాడుకుంటున్న బీజేపీః కాంగ్రెస్ ఎంపీ ఘాటైన విమర్శ
సుశాంత్ను బీహార్ నటుడిగానే ప్రొజెక్ట్ చేస్తూ.. బీహార్ నటుడి మరణంగానే ప్రచారం చేస్తూ బీజేపీ ఎన్నికలలో లబ్ధి పొందాలనుకుంటోందని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి ఘాటుగా విమర్శించారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ మరణాన్ని రాజకీయపార్టీలు తమకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.. మహారాష్ట్రను ఏలుతున్న శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వానికి మరక అంటించేందుకు బీజేపీ శతవిధాల ప్రయత్నిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.. శివసేనపైకి బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ను ఉసిగొల్పుతున్నది బీజేపీనేనని కొందరు అంటున్నారు.. ఇప్పుడు కాంగ్రెస్పార్టీ కూడా అదే మాట అంటోంది.. సుశాంత్ను బీహార్ నటుడిగానే ప్రొజెక్ట్ చేస్తూ.. బీహార్ నటుడి మరణంగానే ప్రచారం చేస్తూ బీజేపీ ఎన్నికలలో లబ్ధి పొందాలనుకుంటోందని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి ఘాటుగా విమర్శించారు..
బీహార్లో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఓట్ల కోసం బీజేపీ కొత్త ఎత్తులు వేస్తున్నదని ఆరోపించారు.. జస్టిస్ ఫర్ సుశాంత్సింగ్ రాజ్పుత్ పేరిట బీహార్ కమలదళం బ్యానర్లు, పోస్టర్లు విడుదల చేయడాన్ని విమర్శించారు. ఇండియన్ యాక్టర్ అయిన సుశాంత్ను బీహార్ నటుడిగా బీజేపీ మార్చివేసిందని ట్విట్టర్లో విమర్శ చేశారు అధీర్ రంజన్ చౌదరి. ఇక నటి రియా చక్రవర్తి పట్ల దర్యాప్తు సంస్థలు దారుణంగా ప్రవర్తిస్తున్నాయని, విచారణ జరుపుతున్న తీరు అమానవీయంగా ఉందని అధీర్ ఆగ్రహించారు. నిజంగానే సుశాంత్ది హత్యే అయితే హంతకుడిని పట్టుకోవడానికి దర్యాప్తు సంస్థలు ఇంకా చీకట్లోనే వెతుకుతున్నాయని అన్నారు. రియా చక్రవర్తిని నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ కింద అరెస్ట్ చేయడాన్ని మూర్ఖపు చర్యగా అభివర్ణించారు అధీర్. సుశాంత్ కేసులో మీడియా చాలా అతి చేస్తున్నదని, న్యాయవ్యవస్థకు అది అరిష్టంగా దాపురించిందని అన్నారు.