హైదరాబాద్లో వర్ష బీభత్సం… భారీగా ట్రాఫిక్ జామ్!
భాగ్యనగరం తడిసి ముద్దయింది. కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. గచ్చిబౌలి, హైటెక్సిటీ, పంజాగుట్ట, ఎర్రగడ్డ, కూకట్పల్లి, సికింద్రాబాద్, తార్నాక, నాచారం, ఈసీఐఎల్, బోయిన్పల్లి సహా చాలా చోట్ల భారీ వర్షం కురిసింది. సుమారు 6 గంటలకు పైగా వర్షం పడడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. పలు చోట్ల బైక్లు కొట్టుకుపోయాయి. మ్యాన్హోల్స్ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులపై భారీగా వర్షపు నీరు నిలవడంతో నగరమంతటా ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. దాంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. ఫ్లైఓవర్లపైనా నీరు […]
భాగ్యనగరం తడిసి ముద్దయింది. కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. గచ్చిబౌలి, హైటెక్సిటీ, పంజాగుట్ట, ఎర్రగడ్డ, కూకట్పల్లి, సికింద్రాబాద్, తార్నాక, నాచారం, ఈసీఐఎల్, బోయిన్పల్లి సహా చాలా చోట్ల భారీ వర్షం కురిసింది. సుమారు 6 గంటలకు పైగా వర్షం పడడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. పలు చోట్ల బైక్లు కొట్టుకుపోయాయి. మ్యాన్హోల్స్ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులపై భారీగా వర్షపు నీరు నిలవడంతో నగరమంతటా ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. దాంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. ఫ్లైఓవర్లపైనా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాత్రి 10.30 గంటల వరకు చిలుకానగర్ 9.1 సెంటీమీటర్లు, కవాడిగూడ 9, ముషీరాబాద్ 8.95, ఓయూ 8.65, షేక్పేట్ 8.52, నాంపల్లి 8.40, ఖైరతాబాద్ 8.37, తిరుమలగిరి 8.25, పాటిగడ్డ 8.17, ఉప్పల్ 8.13 సెం.మీ. వర్షం పడినట్లు అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. భారీ వర్షం నేపథ్యంలో నగర ప్రజలకు జీహెచ్ఎంసీ అడ్వైజరీ జారీ చేసింది. ప్రజలు వీలైనంత వరకు ఇళ్లల్లోనే ఉండాలని.. రోడ్లపైకి రాకూడదని సూచిస్తున్నారు. వర్షాలపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ సమీక్షిస్తున్నారు. రోడ్లు, కాలనీల్లో నిలిచిపోయిన నీటిని వీలైనంత తొందరగా క్లియర్ చేయాలని, పడిపోయిన చెట్లను తొలగించాలని ఆదేశించారు.