Weather Report: కరువు సీమకు మళ్లీ గండం.. మరింత భయపెడుతున్న వెదర్ రిపోర్ట్..
తిరుపతి-తిరుమల ఇంకా తేరుకోనే లేదు. అప్పుడే మళ్లీ వర్షాలంటూ వెదర్ రిపోర్ట్ భయపెడుతోంది. ఈ సారి వర్షాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయి?
AP Rains – Weather Report: ఇటీవల కురిసిన భారీ వర్షాల నుంచి తేరుకోక ముందే తిరుపతి నగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. భారీ వర్షంతో నగరం మరోసారి చెరువును తలపించింది. రాత్రి 9 గంటల నుంచి అరగంట పాటు కుండపోతగా వర్షం కురవడంతో తిరుపతి నగరంలో వీధులు, ప్రధాన రహదారులు జలమయ అయ్యాయి. నగరంలో లక్ష్మీపురం కూడలి, మధురా నగర్ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపు నీరు చేరింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం రావడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషన్ల వద్ద శ్రీవారి దర్శనానికి వచ్చిన యాత్రికులు ఊహించని భారీ వర్షంతో ఇబ్బందులు పడ్డారు.
అల్పపీడన ప్రభావంతో చిత్తూరు జిల్లాలో ఇవాళ్టి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావాణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కానీ, ఒకరోజు ముందుగానే తిరుపతిని భారీ వర్షం ముంచెత్తింది. గతంలో కురిసిన భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తిరుపతి వాసులు ఒక్కసారిగా పెద్ద వర్షం కురవడంతో మరోసారి ఆందోళనకు గురయ్యారు. రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో మరో మూడురోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక తీరముకు దగ్గర్లో సగటు సముద్ర మట్టానికి 3 .1 కిలోమీటర్లు ఎత్తులో విస్తరించిఉంది.
ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీంతో దక్షిణ అండమాన్ సముద్రంలో నవంబర్ 29 తేదీనాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి: Betel Leaves Benefits: ఆరోగ్య సంజీవని తమలపాకు.. రోజుకు రెండు తింటే చాలు..!