Andhra Pradesh: జాలర్ల జాడ కోసం కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్.. బాధిత కుటుంబ సభ్యులకు భరోసానిచ్చిన మాజీ మంత్రులు..
Andhra Pradesh: చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన నలుగురు మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది. పోలీస్, రెవెన్యూ, ఫిషరీస్, మెరైన్, కోస్ట్ గార్డ్, నేవల్, వాతావరణ శాఖల సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది
Andhra Pradesh: చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన నలుగురు మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది. పోలీస్, రెవెన్యూ, ఫిషరీస్, మెరైన్, కోస్ట్ గార్డ్, నేవల్, వాతావరణ శాఖల సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద సముద్రంలో జాలర్ల కోసం వేట కొనసాగుతుంది. మచిలీపట్నం జాలర్ల బోటు చివరిగా అంతర్వేది కి 10 కీలోమీటర్ల దూరంలో ఆగిపోయినట్టు బోటు యజమానికి కాల్ వచ్చింది. వెంటనే అంతర్వేది స్పాట్ వద్దకు వెళ్ళి చూస్తే బోటు కనిపించలేదంటున్నారు బోట్ ఓనర్. ప్రస్తుతం అంతర్వేది, కరవాక, నరసాపురం చుట్టుపక్కల ప్రాంతాల సముద్రతీరంలో గాలిస్తున్నారు అంతర్వేది మెరైన్ పోలీసులు. ఇప్పటివరకు మత్స్యకారుల బోటు జాడ కనిపించకపోవడంతో అంతర్వేది తీరంలో రెండు మెరైన హెలికాప్టర్లతో గాలింపు చేపట్టారు.
కంగారు పడొద్దు..
మచిలీపట్నం క్యాంప్బెల్పేటకు చెందిన చిన్నమస్తాన్, చిననాంచారయ్య, నరసింహారావు, మోకా వెంకటేశ్వరరావు శనివారం గిలకలదిండి నుంచి మరబోటుపై సముద్రంలో వేటకు వెళ్లారు. వాస్తవానికి చేపల వేట ముగించుకుని మంగళవారం మత్స్యకారులు తిరిగి రావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు వారి ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. జాలర్ల సెల్ఫోన్ కూడా స్విచాఫ్ కావడంతో గాలింపు మరింత కష్టంగా మారింది. మరోవైపు గల్లంతయిన మత్స్యకారుల కుటుంబాలకు మాజీ మంత్రి భరోసా ఇచ్చారు. అందరూ ధైర్యంగా ఉండాలని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. ఎవరూ కంగారు పడొద్దంటూ బాధితులను ఓదార్చారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా బాధితులను పరామర్శించారు. గాలింపులో ఆలస్యం జరగడంతో కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గాలింపు చర్యల్లో ప్రభుత్వ నిలర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని, కేంద్ర సహాయం తీసుకోవాలని సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..