
ఏపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఎస్సీ, ఎస్టీ వ్యాపారులకు ప్రభుత్వం ప్రోత్సహకాలు అందిస్తోంది. వీటిని గత కొంతకాలంగా పెండింగ్లో పెట్టగా.. తాజాగా విడుదల చేయడంతో పారిశ్రామికవేత్తలు ఆనందంలో ముగినిపోయారు. ఏకంగా రూ.60.21 కోట్లను వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది.

ప్రభుత్వం ప్రోత్సాహకాల నిధులు విడుదల చేయడంతో దీని ద్వారా 3,122 మంది ఎస్సీ, 495 మంది ఎస్టీ పారిశ్రామికవేత్తలు లబ్ది పొందారు. గత ఏడాది అక్టోబర్లో కూడా రూ.209.69 కోట్ల రూపాయాలను ప్రభుత్వం విడుదల చేసింది. దీని ద్వారా 6,675 మంది ఎస్సీ, 1159 మంది ఎస్టీ పారిశ్రామికవేత్తలు లబ్ది పొందారు.

తాజాగా విడుదల చేసిన నిధులతో కలిపి ఈ ఏడాది ఇప్పటివరకు ప్రభుత్వం మొత్తం వీరికి ప్రోత్సహకాల కింద రూ.269.90 కోట్లు విడుదల చేసింది. ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎప్పటికప్పుడు వీటిని విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

కొత్తగా వ్యాపారాలు చేసుకునేవారితో పాటు తమ వ్యాపారాలను విస్తరించాలనుకునేవారికి ఈ ప్రోత్సాహాకాలు ఉపయోగపడనున్నాయి. ఎస్సీ, ఎస్టీ వ్యాపారులను మరింత ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని విధాలుగా వారికి అండగా నిలుస్తామని మంత్రి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇటీవల తమకు రావాల్సిన రాయితీలు విడుదల చేయాలంటూ పారిశ్రామికవేత్తలు ధర్నా చేపట్టారు.

మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయం దగ్గర ఆందోళన చేపట్టగా.. పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. స్థానికంగా ఉండే పారిశ్రామివేత్తలకు కాకుండా విదేశీ పెట్టుబడిదారులకు సబ్సిడీలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని తెలిపారు. రాయితీలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు