అమెజాన్ ద్వారా ప్యాకేజింగ్ ఫ్రీ షిప్పింగ్ సేవలు..!
అమెజాన్ ఇండియా ప్యాకేజింగ్ వ్యర్థాలను తగ్గించే దిశగా నిర్ణయం తీసుకుంది. దేశంలోని 100 నగరాల్లో ప్యాకేజింగ్-ఫ్రీ షిప్పింగ్ సేవలను అందించనున్నట్లు ప్రకటన.
కరోనా దెబ్బకు పెద్ద కంపెనీలు పొదుపు చర్యలు మొదలు పెట్టాయి. లాక్ డౌన్ ప్రభావంతో ఆర్ధిక భారాన్ని తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ ఇండియా ప్యాకేజింగ్ వ్యర్థాలను తగ్గించే దిశగా నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం దేశంలోని 100 నగరాల్లో ప్యాకేజింగ్-ఫ్రీ షిప్పింగ్ సేవలను అందించనున్నట్లు ప్రకటించింది. ఈ విధానంలో అదనపు ప్యాకేజింగ్ లేకుండా వినియోగదారుడికి అందించేందుకు ఫ్లాన్ చేస్తోంది. ప్యాకేజీని తగ్గించకుండా వాటి అసలు ప్యాకేజింగ్తో రవాణా చేయనున్నారు. అమెజాన్ మొట్టమొదటిసారిగా జూన్ 2019 లో భారతదేశంలోని 9 నగరాల్లో ప్యాకేజింగ్-ఫ్రీ షిప్పింగ్ సేవలను ప్రారంభించింది. ఏడాదిలోనే ఈ కార్యక్రమాన్ని100 కి పైగా నగరాలకు విజయవంతంగా విస్తరించేందుకు సిద్ధమైంది. ఈ విస్తరణతో అమెజాన్ ఇండియా కేంద్రాల నుంచి రవాణా చేస్తున్న అమెజాన్ కస్టమర్ ఆర్డర్లలో 40శాతంపైగా ఇదే రకమైన ప్యాకేజింగ్ అందిస్తున్నది. పిఎఫ్ఎస్ విధానంలో అల్గారిథం సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభావితం చేస్తుంది. అమెజాన్ ఈ సేవలను వేగంగా అందించడానికి ఉత్పత్తి , రవాణా పరిస్థితులను బట్టి ప్యాకేజింగ్ రక్షణను సర్దుబాటు చేయడానికి మెషిన్ లెర్నింగ్ అల్గారిథం టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ప్యాకేజింగ్ రహితంగా రవాణా చేసిన ఉత్పత్తుల్లో టెక్ టూల్స్, గృహ సంబంధిత ఉత్పత్తులు, బూట్లు ఇతర పరికరాలు ఉన్నాయి. ప్యాకేజీల వల్ల కలిగే వ్యర్ధాలను తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ కంపెనీ ప్రతినధి ఒకరు తెలిపారు.