ఏడాదిలో ఏడోసారి.. శ్రీశైలానికి ముప్పేనా ?

శ్రీశైలం డ్యామ్ నిర్మించిన తర్వాత తొలిసారి ఇది. ఒకే సంవత్సరం ఒకే సీజన్‌లో ఏడోసారి డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలారు. జులై మూడో వారంలో కూడా డ్రైగా కనిపించిన శ్రీశైలం ప్రాజెక్టు.. రిజర్వాయర్.. ఆ తర్వాత వరుసగా వస్తున్న వరద నీటితో పూర్తిస్థాయికి నిండింది. కర్నాటక, మహారాష్ట్రల్లోని కృష్ణా రివర్ బేసిన్‌లో కురిసిన భారీ వర్షాలు నదిలోకి భారీగా వరదనీరు చేరేలా చేసింది. ఫలితంగా ఆల్మట్టి, నారాయణ్‌పూర్, జూరాల, తుంగభద్ర ఢ్యామ్‌ల నుంచి తరచూ […]

ఏడాదిలో ఏడోసారి.. శ్రీశైలానికి ముప్పేనా ?
Follow us

|

Updated on: Oct 23, 2019 | 1:27 PM

శ్రీశైలం డ్యామ్ నిర్మించిన తర్వాత తొలిసారి ఇది. ఒకే సంవత్సరం ఒకే సీజన్‌లో ఏడోసారి డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలారు. జులై మూడో వారంలో కూడా డ్రైగా కనిపించిన శ్రీశైలం ప్రాజెక్టు.. రిజర్వాయర్.. ఆ తర్వాత వరుసగా వస్తున్న వరద నీటితో పూర్తిస్థాయికి నిండింది. కర్నాటక, మహారాష్ట్రల్లోని కృష్ణా రివర్ బేసిన్‌లో కురిసిన భారీ వర్షాలు నదిలోకి భారీగా వరదనీరు చేరేలా చేసింది.

ఫలితంగా ఆల్మట్టి, నారాయణ్‌పూర్, జూరాల, తుంగభద్ర ఢ్యామ్‌ల నుంచి తరచూ లక్షలాది క్యూసెక్కుల నీటిని కిందికి వదలడంతో శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు పలు మార్లు చేరువైంది. దాంతో ఒకే సీజన్‌లో అది కూడా జులై-అక్టోబర్ నెలల మధ్య కాలంలో ఏడు సార్లు శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌ నీరు వదిలారు. తాజాగా తాజాగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం రాత్రి మూడు గేట్లు సుమారు 10 అడుగుల మేర ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. అయితే వరద ఉధృతి మరింత పెరగడంతో ఉదయం ఏడు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు.

ప్రాజెక్టులో ప్రస్తుతం 215 టీఎంసీల నీరు ఉంది. స్పిల్ వే ద్వారా లక్షా 95వేల క్యూసెక్కుల నీటిని సాగర్ కుడి ఎడమ కాలువలకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా మరో 68వేల క్యూసెక్కులను వదులుతున్నారు. అయితే ఈ ఏడాది శ్రీశైలం జలాయశం చరిత్ర సృష్టించింది. ఈ ఏడాదిలో జలాశయం గేట్లు తెరవడం ఇది ఏడవసారి. ఎన్నడూ లేని విధంగా డ్యాం గేట్లను ఈ ఏడాది భారీ వర్షాల దృష్ట్యా ఏడుసార్లు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడం జరిగింది. భారీ వర్షాలతో డ్యాంకు భారీ వరద కొనసాగుతోంది. దాంతో బుధవారం మధ్యాహ్నానికి మరో మూడు గేట్ల అంటే మొత్తం పది గేట్లను పది అడుగుల మేరకు ఎత్తి భారీ స్థాయిలో నీటిని సాగర్ జలాశయానికి వదులుతున్నారు.

మరోవైపు శ్రీశైలం దగ్గర రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఏపీ పరిధిలో వున్న కుడి గట్టు జలవిద్యుత్ కేంద్రంలో ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 850 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగినట్లు సమాచారం. దీన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే.. ఈ ఉత్పత్తిలో యూనిట్లు సంఖ్య 850 మిలియన్లు దాటగానే పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేందుకు జెన్‌కో సిబ్బంది రెడీ అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.