2020 Round-up : 2020లో ఈ లోకాన్ని వీడి అభిమానులను శోకసంద్రంలోకి నెట్టిన సినీ తారలు..
2020 అత్యంత వరస్ట్ అన్నది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెజార్టీ ప్రజల అభిప్రాయం. ఈ సంవత్సరం చేసిన అల్లకల్లోలాలు అన్నీ, ఇన్నీ కావు. ఇక సినిమా ఇండస్ట్రీకి ఈ ఇయర్ చాలా వరస్ట్ అని చెప్పాలి.
2020 అత్యంత వరస్ట్ అన్నది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెజార్టీ ప్రజల అభిప్రాయం. ఈ సంవత్సరం చేసిన అల్లకల్లోలాలు అన్నీ, ఇన్నీ కావు. ఇక సినిమా ఇండస్ట్రీకి ఈ ఇయర్ చాలా వరస్ట్ అని చెప్పాలి. కరోనా నేపథ్యంలో చిత్రాలు విడుదల, చిత్రీకరణ ఆగిపోయి..వేల సంఖ్యలో టెక్నీషియన్లు, చిన్న..చిన్న నటులు పడ్డ కష్టాలు వర్ణణాతీతం. మరోవైపు చాలామంది అద్భుతమైన నటులు, కళాకారులు ఈ ప్రపంచాన్ని వీడి వెళ్లిపోయారు. సినీ ప్రేమికులు, అభిమానులు శోకసంద్రంలోకి నెట్టారు. 2020 లోకాన్ని వీడిన సినీ ప్రముఖుల ఎవరో ఇప్పుడు చూద్దాం.
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం :
దక్షిణాది సినీ పరిశ్రమకు పూడ్చలేని వెలితి ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారు లేకపోవడం. తన గాత్రంలో ఆయన ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఒక రకంగా కరోనా ఆయన్ను మన నుంచి దూరం చేసింది. కోవిడ్ బారిన పడ్డ ఆయన..దాని నుంచి కోలుకున్నప్పటికీ ఇతర ఆరోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 25న తుదిశ్వాస విడిచారు. సుమారు 40వేల పాటలు పాడిన గాన గంధర్వుడు ఆరుసార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. కేవలం గాయకుడిగా మాత్రమే కాదు…నటుడిగా, సంగీత దర్శకుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు.
జయప్రకాశ్ రెడ్డి :
తెలుగు సినీ ప్రపంచం ఈ ఏడాది మరో గొప్ప నటుడ్ని కోల్పోయింది. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసే నటుడు జయప్రకాశ్ రెడ్డి కూడా ఈ యేడాదే బాహ్య ప్రపంచాన్ని వీడారు. గుండెపోటుతో గుంటూరులోని తన నివాసంలో సెప్టెంబర్ 8న ఆయన కన్నుమూశారు. రంగస్థలం మీద చేసిన అభిమానంతో ఆయన వెండితెరపై అలవోకగా వివిధ హావభావాలు పలికిస్తూ..అనతి కాలంలోనే తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. ఫ్యాక్షన్ సినిమాల్లో విలన్గా చేసిన ఆయనకు విపరీతమమైన అప్లాజ్ వచ్చింది. కామెడీలోనూ జేపీ మార్క్ చాలా స్పెషల్.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ :
ఈ ఏడాది కరోనా తర్వాత అంతకంటే ఎక్కవ చర్చనీయాంశమైన విషయం సుశాంత్ రాజ్పుత్ మరణం. ఇండియా సినిమా ప్రపంచంలో ఈ విషయం పెను ప్రకంపనలు సృష్టించింది. అతని చావు చుట్టూ ఎన్నో అనుమానాలు..మరెన్నో వివాదాలు. ఇప్పటికీ వాటి లెక్క తేలలేదు. 2020 జూన్ 14న సుశాంత్ తన ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని తనువు చాలించాడు. ఎయిమ్స్ ఆసుపత్రి సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసును ఆత్మహత్యగా ప్రకటించినప్పటికీ..అనుమానాలు మాత్రం వీడలేదు. సుశాంత్ చివరిగా ‘దిల్ బెచారా’ సినిమాలో నటించాడు. ఆయన మరణించిన తర్వాత ఈ చిత్రం ఓటీటీలో రిలీజైంది.
ఇర్ఫాన్ ఖాన్ :
భారతీయ సినిమా చరిత్రలో అద్బుతమైన నటులు లిస్ట్లో ప్రధాన జాబితాలో ఉంటాడు ఇర్ఫాన్ ఖాన్. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వెళ్లి..తన ప్రస్థానాన్ని అద్వితీయంగా సాగించారు. 1988లో “సలాం బాంబే” చిత్రంలో సినీ ప్రయాణం సాగించిన ఇర్ఫాన్..న్యూరో ఎండోక్రిన్ క్యాన్సర్తో ఈ ఏడాది ఏప్రిల్ 29న కన్నుమూశారు.
రిషి కపూర్ :
బాలీవుడ్ లవర్బోయ్గా, రొమాంటిక్ హీరోగా రాణించిన రిషి కపూర్ కూడా ఈ ఏడాది కన్నుమూశారు. క్యాన్సర్తో బాధపడుతూ ఏప్రిల్ 30న ఆయన 67 సంవత్సరాలు వయస్సులో తుదిశ్వాస విడిచారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు రాజ్కపూర్ రెండో కుమారుడైన రిషి కపూర్ బాలనటుడిగా సినీ ప్రయాణాన్ని ప్రయాణించి..ఆ తర్వాత హీరోగా మారి…దాదాపు రెండున్నర దశాబ్దాలు అగ్రపథాన కొనసాగారు.