COVID Vaccine : మెడిసిన్ ఇచ్చి ఆదుకున్న భారతం..మన వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాల ఆరాటం
ఇప్పటికే కొన్ని దేశాలలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇండియా కూడా 2021 జనవరిలో వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించనుంది. ఈ మహమ్మారి వైరస్ తో విసిగి వేసారిన ప్రపంచంలోని పలు దేశాలు..
ఇప్పటికే కొన్ని దేశాలలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇండియా కూడా 2021 జనవరిలో వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించనుంది. ఈ మహమ్మారి వైరస్ తో విసిగి వేసారిన ప్రపంచంలోని పలు దేశాలు..వ్యాక్సిన్ కోసం ఇండియావైపు చూస్తున్నాయి. 2020 లో మహమ్మారి ప్రపంచాన్ని తాకినప్పుడు..భారతీయ ఫార్మా ఇండస్ట్రీ ప్రపంచ దేశాలకు మెడిసిన్ పరంగా ఎంతో సాయం చేసింది. హెచ్సిక్యూ, పారాసెటమాల్ వంటి మెడిసిన్ ను ప్రపంచవ్యాప్తంగా 150 కి పైగా దేశాలకు ఎగుమతి చేసింది.
తాజాగా మహమ్మారిని నియంత్రించడానికి అవసరమైన వ్యాక్సిన్ తయారీ, సప్లై కోసం మరోసారి ప్రపంచం..ఇండియా వైపు చూస్తుంది. “ప్రపంచ వ్యాప్తంగా అవసరమైన వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారతదేశం వాటా 60 శాతంగా ఉంది. ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ల పంపిణీలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుంది” అని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపిఎ) సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ చెప్పారు. భారతీయ కంపెనీలైన జైడస్, భారత్ బయోటెక్, జెన్నోవా దేశీయ వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తుండగా..మరికొన్ని దేశీయ కంపెనీలు గ్లోబల్ కంపెనీలతో (సీరం ఇన్స్టిట్యూట్- ఆస్ట్రాజెనెకా, డాక్టర్ రెడ్డీస్- స్పుత్నిక్, బయోలాజికల్ ఇ- జె అండ్ జె) కంపెనీలతో కలిసి వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నాయని తెలిపారు. టీకా పంపిణీలో భారతదేశం కీలక భూమిక పోషించబోతంని.. దశలవారీగా పంపిణీని జరపడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుందని ఆయన చెప్పారు. కోవిడ్ పరిస్థితిని నుంచి బయటపడటానికి ప్రపంచలోని దేశాల మధ్య సహకారం, సమన్వయం ముఖ్యమని సుదర్శన్ జైన్ అన్నారు.
ప్రస్తుతం భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఫైజర్ కంపెనీల వ్యాక్సిన్లు సమర్థతను ప్రదర్శిస్తున్నాయని.. ఈ మూడింటికి లేదా ముందుగా ఒక కంపెనీకి లైసెన్స్ లభిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ ఔషధ తయారీదారుల సంఘం (ఐడిఎంఎ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ కుమార్ మదన్ మాట్లాడుతూ.. “టీకాలు జనవరి 2021 నుంచి అందుబాటులోకి రానున్నాయి. కఠినమైన అంతర్జాతీయ నిబంధనల పాటించిన ఈ టీకాలను డ్రగ్స్ కంట్రోలర్ ఆమోదించారు. డబ్ల్యూ.హెచ్.ఓ వ్యాక్సిన్ సేకరణలో దాదాపు 70 శాతం భారతదేశం నుంచి వస్తున్నందుకు మేము గర్విస్తున్నాము ” అని చెప్పారు. ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ లభ్యతపై, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవల్లా మాట్లాడుతూ… ఇండియా, యూకేలో ట్రయల్ ఫలితాల ఆధారంగా, రెగ్యులేటరీ సంస్థల నుంచి త్వరగా గ్రీన్ సిగ్నల్ లభిస్తే.. జనవరి 2021 నాటికి భారతదేశంలో లభిస్తుందని చెప్పారు.
Also Read : Strain Virus: నెల్లూరులో కలకలం.. బ్రిటన్ నుంచి వచ్చిన వ్యక్తికి స్ట్రెయిన్ పాజిటివ్గా నిర్ధారణ…