Viral Video: ప్రాణం పోతున్నా.. ప్రయాణికులను కాపాడి..

Updated on: Sep 01, 2025 | 11:05 AM

ఓ డ్రైవర్‌ సమయస్పూర్తి, అంకిత భావం పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడింది. బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించి , ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకూడదని భావించి ఆ డ్రైవర్‌ స్టీరింగ్‌ను తోటి డ్రైవర్‌కు అప్పగించి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది.

సుదూర ప్రాంతాలకు ప్రయాణించే బస్సుల్లో ఇద్దరు డ్రైవర్ల ఆవశ్యకతను మరోసారి గుర్తు చేస్తోంది. రాజస్థాన్‌కు చెందిన సతీష్‌ అనే డ్రైవర్‌ గురువారం ఉదయం జోధ్‌పూర్‌ నుంచి ఇండోర్‌కు వెళ్తున్న బస్సును నడుపుతున్నారు. కేల్వారాజ్‌ నగర్‌ దగ్గరకు రాగానే అతనికి ఏదో అసౌకర్యంగా అనిపించింది. నెమ్మదిగా చాతీలో నొప్పి మొదలైంది. తగ్గిపోతుందిలే అనుకొని సతీష్‌ బస్సును డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్తున్నాడు. నెమ్మదిగా నొప్పి ఎక్కువ కావడంతో పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించి వెంటనే అలర్టయ్యాడు. తోటి డ్రైవర్‌ను పిలిచి బస్సును నడపాల్పిందిగా చెప్పిం స్టీరింగ్‌ అతనికి అప్పగించి పక్కకు వచ్చాడు. మరుక్షణం కుప్పకూలిపోయాడు. ఈ హఠాత్పరిణామానికి షాకయిన ప్రయాణికులు భయాందోళనకుగురయ్యారు. ఓ మహిళ భయంతో కేకలు వేయడంతో మిగతా ప్రయాణికులు వచ్చి సపర్యలు చేశారు. అతన్ని లేపి నిలబెట్టే ప్రయత్నంచేశారు. బస్సును నడుపుతున్న మరో డ్రైవర్‌ గోమతి చౌరస్తాలో ఆపి మందుల కోసం ప్రయత్నించాడు. కానీ అప్పటికే మందుల షాపులు మూసివేయడంతో వెంటనే బస్సును ముందుకు పోనిచ్చాడు. తోటి డ్రైవర్‌ను బ్రతికించుకునేందుకు ఎంతో ఆత్రంగా ముందుకు పోనిచ్చాడు. సతీష్‌ పరిస్థితి మరింత విషమించింది. కంగారు పడిన డ్రైవర్ బస్సును వేగంగా పోనిస్తూ నేరుగా దేశూరిలోని ఆస్పత్రికి తరలించాడు. కానీ ఆయన ప్రయత్నం ఫలించలేదు. సతీష్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. కళ్లముందే సహోద్యోగి విగతజీవిగా మారడంతో భావోద్వేగానికి గురయ్యాడు. ఆ దృశ్యం ప్రయాణికులను కలచివేసింది. సతీష్‌ ప్రాణం పోతున్న సమయంలోనూ సమయస్పూర్తిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని చర్చించుకున్నారు. ఈ దృశ్యాలు బస్సులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు.