పీఎం మోదీ ఏసీ స్కీమ్ అంతా ఫేక్.. వీడియో వైరల్

Updated on: Apr 28, 2025 | 10:23 PM

ప్రజలకు ఉచిత ఎయిర్ కండిషనర్లు అందిస్తామని హామీ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం, పీఎం మోడీ ఏసీ యోజన 2025 అనే కొత్త పథకాన్ని ప్రారంభించిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ ప్రచారాన్ని ప్రభుత్వం తోసిపుచ్చింది. అలాంటి పథకం ఏదీ లేదని తేల్చి చెప్పింది. పుకార్లను నమ్మి ప్రజలు ఎవ్వరూ మోసపోవద్దని సూచించింది. ఏటీకేడు వేసవిలో ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో ఏసీల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం పీఎం మోడీ ఏసీ యోజన అమలు చేసేందుకు సిద్ధమవుతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది.

పాత ఏసీ స్థానంలో ఫైవ్ స్టార్ రేటెడ్ ఏసీని రిప్లేస్ చేసుకోవచ్చన్నది దాని సారాంశం. ఈ స్కీం కింద ఏసీ కొనుగోలు చేస్తే డిస్కౌంట్ కూడా పొందవచ్చు అని ఉదరగొడుతున్నారు. మే నెలలో పీఎం మోడీ ఏసీ యోజన 2025 పథకం ప్రారంభిస్తారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకునే వ్యక్తులకు ఉచితంగా ఫైవ్ స్టార్ ఏసీలను అందిస్తుంది అనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఆ ప్రచారం ఎంతగా వైరల్ అయిందంటే పీఐబీ అధికారిక హ్యాండిల్ నుంచి ప్రకటన చేయాల్సి వచ్చింది. ప్రధానమంత్రి ఏసీ యోజనపై జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చింది. అదంతా ఉత్త ప్రచారమని క్లారిటీ ఇచ్చింది. ఫ్రీగా ఫైవ్ స్టార్ ఎయిర్ కండిషనర్లను అందించే పథకాన్ని కేంద్రం ఇప్పటివరకు ప్రకటించలేదని స్పష్టం చేసింది.