వేలానికి బంగారు టాయిలెట్.. ధర ఎంతో తెలుసా
బంగారం టాయిలెట్ వేలమా.. మీరు విన్నది నిజమే...బంగారు టాయిలెటే.. పూర్తిగా బంగారంతో తయారుచేసింది. నమ్మశక్యంగా లేదుకదూ.. కానీ నమ్మాలి. ఇటాలియన్ కళాకారుడు మారిజియో కాటెలాన్ దీనిని రూపొందించారు. 18 క్యారెట్ల బంగారంతో తయారుచేసిన ఈ టాయిలెట్కు అమెరికా అని పేరు పెట్టారు. దీనిని ప్రముఖ వేలం సంస్థ సోత్’బీస్ నవంబరు 18న న్యూయార్క్లో వేలం వేయనుంది.
దీని కనీస ధరను సుమారు 10 మిలియన్ డాలర్లు అంటే దాపు రూ. 83 కోట్లుగా నిర్ణయించారు. ఈ టాయిలెట్ బరువు 101.2 కిలోలు. ఇది కేవలం ప్రదర్శన కోసం తయారు చేసింది అనుకునేరు. ఇది మన సాధారణ టాయిలెట్లాగే పూర్తిగా పనిచేస్తుందికూడా. సంపన్నుల విలాసాలపై వ్యంగ్యాస్త్రంగా కాటెలాన్ దీనిని రూపొందించారు. ఈయన గతంలో గోడకు డక్ట్ టేప్తో అతికించిన ఒక అరటిపండును ‘కామెడియన్’ పేరుతో ప్రదర్శించి, దానిని 6.2 మిలియన్ డాలర్లకు విక్రయించి సంచలనం సృష్టించారు. అలాగే, మోకాళ్లపై కూర్చుని ఉన్న హిట్లర్ శిల్పాన్ని 17.2 మిలియన్ డాలర్లకు అమ్మారు. కాగా, ఈ బంగారు టాయిలెట్కు ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. 2016లో కాటెలాన్ ఇలాంటివి రెండు టాయిలెట్లను తయారు చేశారు. వాటిలో ఒకటి 2019లో ఇంగ్లండ్లోని బ్లెన్హీమ్ ప్యాలెస్లో ప్రదర్శనలో ఉంచగా, దొంగతనానికి గురైంది. దొంగలు దానిని ప్లంబింగ్తో పాటు పెకిలించుకుని పారిపోయారు. ఆ టాయిలెట్ ఇప్పటికీ దొరకలేదు. దానిని దొంగలు కరిగించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పుడు వేలానికి వస్తున్నది రెండవది. దీనిని 2017 నుంచి ఒక ప్రైవేట్ స్థలంలో భద్రపరిచారు. గతంలో ఈ టాయిలెట్ను న్యూయార్క్లోని గుగ్గెన్హీమ్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ఆ సమయంలో దానిని ఉపయోగించేందుకు లక్ష మందికి పైగా సందర్శకులు క్యూ కట్టారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ కోసం వాన్ గో పెయింటింగ్ను అడగ్గా, మ్యూజియం వారు దానికి బదులుగా ఈ బంగారు టాయిలెట్ను ఆఫర్ చేశారు. నవంబరు 8 నుంచి వేలం ముగిసే వరకు ఈ ‘అమెరికా’ టాయిలెట్ను సోత్’బీస్ ప్రధాన కార్యాలయంలోని ఒక బాత్రూంలో ప్రదర్శనకు ఉంచుతారు. సందర్శకులు దీనిని దగ్గర నుంచి చూడవచ్చు. అయితే, గతంలో లాగా దీనిని ఉపయోగించుకునే అవకాశం మాత్రం లేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చేపల కోసం వలవేస్తే.. ఏం చిక్కాయో చూడండి
Rain Alert: ఏపీని వదలని వరుణుడు.. ఈనెల 5 నుంచి భారీ వర్షాలు
40 ఏళ్లు దాటాక.. ఇవి తినాలంటున్న నిపుణులు
