సరిగ్గా దండలు మార్చుకునే టైంకి..పెళ్లి కొడుకు ఫేస్ చూసి బిత్తరపోయిన వధువు

Updated on: May 03, 2025 | 3:42 PM

ఉత్తరప్రదేశ్‌లోని వివాహ వేడుకలో అనుకోని ఘటన జరిగింది. వధువు, మండపంలో వరుడిని చూసి పెళ్లికి నిరాకరించడంతో గందరగోళం చెలరేగింది. ముందుగా చూపించిన వ్యక్తితో కాకుండా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారని వధువు ఆరోపించింది. అదే సమయంలో వరుడు పెళ్లి ఊరేగింపుతో వచ్చాడు. సరిగ్గా దండలు మార్చుకునే జైమాల వేదికపై వధువు పెళ్లికి నిరాకరించడంతో గొడవ మొదలైంది. అమ్మాయి తరపు వారు వరుడితో సహా పెళ్లి కొడుకు తరఫు వారిని బంధించారు. గంటల తరబడి చర్చలు జరిగినప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాలేదు. పెళ్లిని ఆపేశారు.

శుక్రవారం సాయంత్రం భడోహిలోని ఓ గ్రామానికి ఒక వివాహ ఊరేగింపు వచ్చింది. ఊరేగింపుకు అమ్మాయి తరపు వారు ఘన స్వాగతం పలికారు. దీని తరువాత పెళ్లివారికి అల్పాహారం ఇచ్చారు. అల్పాహారం తర్వాత కొద్దిసేపటికే జైమాల వేడుక ప్రారంభమైంది. వరుడు తన స్నేహితులతో జైమాల వేదికపై కూర్చుని ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత, వధువు కూడా జైమాల వేదికకు చేరుకుంది. ఆ సమయంలో వరుడిని చూసి ఆమె షాక్ అయ్యింది. ఇతను పెళ్లి కొడుకు కాదంటూ ఆమె ఆరోపించింది. కొంతమంది వధువును ఒప్పించడానికి ప్రయత్నించారు, కానీ ఆమె ఎవరి మాట వినలేదు. అతన్ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను సర్ది చెప్పి. అక్కడి నుంచి పంపిచేశారు.