సినిమా తరహాలో దోపిడీ.. బ్యాంకు సిబ్బందిని కట్టేసి 20 కిలోల బంగారం లూటీ వీడియో
కర్ణాటకలోని విజయపుర జిల్లా ఎస్బీఐ బ్రాంచ్లో భారీ దోపిడీ జరిగింది. చడ్చనా పట్టణంలోని బ్యాంక్ శాఖకు ముసుగులు ధరించి వచ్చిన దుండగులు తుపాకులు, ఇతర ఆయుధాలతో సిబ్బందిని బెదిరించి రూ.21కోట్ల విలువైన బంగారం, నగదును దోచుకున్నారు. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా బ్యాంకులోకి చొరబడిన దొంగలు ఉద్యోగులను బంధించి దోపిడీకి పాల్పడ్డారు. నిందితులు వాడిన కారు పంధర్పుర్ ప్రాంతానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు.
దొంగలు మిలిటరీ యూనిఫామ్ను పోలిన దుస్తులు ధరించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దోపిడీ సమయంలో బ్యాంక్ మేనేజర్ అలారమ్ బెల్ను నొక్కకుండా వారు ఆయుధాలతో బెదిరించినట్లు తెలిసింది. డాగ్స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు ఆ ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కేసును ఎస్పీ లక్ష్మణ్ నింబార్గి పర్యవేక్షిస్తున్నారు. బ్యాంక్ మూసివేసే సమయంలో సాయంత్రం 6.30 గంటలకు ఈ ఘటన జరిగింది. సిబ్బందిని బెదిరించి స్ట్రాంగ్రూమ్ వివరాలు తెలుసుకొని.. అందులోని సొమ్మును దోచుకున్నట్లు గుర్తించారు.ఓ కస్టమర్ ఆ సమయంలో బ్యాంకులోకి వెళ్లి పరిస్థితి గమనించి.. పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. దొంగలు మహారాష్ట్రకు పారిపోయి ఉంటారని ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు. ముగ్గురి కంటే ఎక్కువ మంది దీనిలో పాల్గొనట్లు భావిస్తున్నారు. దొంగల కోసం కర్ణాటక , మహారాష్ట్రలో భారీగా గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు రూ.20 కోట్ల విలువైన 20 కేజీల బంగారు నగలు, రూ.కోటి వరకు నగదును దుండగులు దోచుకెళ్లినట్లు పోలీసులు తమ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ ఏడాది మేలో కూడా విజయపుర జిల్లాలోని కెనరా బ్యాంక్లో భారీ దోపిడీ జరిగింది. లాకర్ల నుంచి 58 కిలోల బంగారం రూ.5.2 లక్షల నగదును దుండుగులు దోచుకొన్నారు. దొంగలు బ్యాంకులో చొరబడే ముందు సీసీటీవీ కెమెరాల వైర్లు, విద్యుత్తు తీగలను కత్తిరించారు. ఖాదీమారా ముఠా ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
మరిన్నివీడియోల కోసం :
భయం లేదు.. అప్రమత్తంగా ఉంటే చాలు వీడియో