Suryapet: ఒకే స్తంభానికి 40కి పైగా సీసీ కెమెరాలు!

Updated on: Sep 24, 2025 | 1:46 PM

సాధారణంగా రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాలకు సీసీ కెమెరాలను అమర్చడం మనం చూస్తుంటాం. ఆ వీధిలో రాకపోకలు సాగించే వారిపై నిఘా ఉంచడానికి, దొంగతనాలు సహా ఇతర నేరాలను అరికట్టడానికి పోలీసులు వాటిని ఏర్పాటు చేస్తుంటారు. సాధారణంగా ఒక స్తంభానికి నాలుగు దిక్కులను కవర్ చేయడానికి నాలుగు సీసీ కెమెరాలు అమరుస్తుంటారు.

అలాంటిది సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణం లోని ఓ విద్యుత్ స్తంభానికి ఏకంగా 4‌0కి పైగా సీసీ కెమెరాలు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీంతో.. ఆ మార్గంలో వెళ్లే ప్రజలంతా ఈ స్తంభాన్ని చూసి నోరెళ్ల పెడుతున్నారు. ఒకే స్తంభానికి ఇన్ని కెమెరాలు ఎవరు, ఎందుకు అమర్చారని.. స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కెమెరాల ఏర్పాటు వెనక.. ఓ వినూత్నమైన వ్యాపారి ఆలోచన ఉందని తెలుసుకుని.. వారెవా.. అనుకుంటూ ముందుకుసాగిపోతున్నారు. వ్యాపార విస్తరణ, సేల్స్ పెంచుకునేందుకు వ్యాపారులు నానా తంటాలు పడుతుంటారు. అడ్వర్టైజ్ మెంట్స్ తోపాటు డిస్కౌంట్లు, ఆఫర్లు, వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటూ ఊదర గొడుతుంటారు. సాధారణంగా తమ వ్యాపారానికి సంబంధించి సింబాలిక్ గా షాపు ముందు ఏదైతే పాత వస్తువులను ఏర్పాటు చేస్తుంటారు. హుజూర్ నగర్ పట్టణం లో స్థానికంగా సీసీ కెమెరాలను విక్రయించే ఓ వ్యాపారి చేసిన వినూత్న ఆలోచన ఇది. అసలు విషయమేంటంటే.. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో వివేకానంద సెంటర్‌ నుంచి పీఎస్‌ఆర్‌ సెంటర్‌ వైపు వెళ్లే దారిలో ఓ వ్యక్తి సీసీ కెమెరాల వ్యాపారం చేస్తున్నారు. ఆ మార్గంలో వెళ్లే వారి దృష్టిని ఆకర్షించడానికి, తన వ్యాపారం గురించి అందరికీ తెలిసేలా చేయడానికి ఆయన ఒకే స్తంభానికి పదుల సంఖ్యలో సీసీ కెమెరాలను అమర్చారు. పాడైపోయిన సీసీ కెమెరాలను ఈ విధంగా ప్రచారం కోసం ఉపయోగిస్తున్నారు. తన దుకాణంలో పాడైపోయిన సీసీ కెమెరాలతో అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఈ ప్రయత్నం చేశానని షాప్ యజమాని రూపాచారి చెబుతున్నారు. వ్యాపార అభివృద్ధి ఏమో కాని.. ఆలోచన మాత్రం భిన్నంగా ఉందనీ స్థానికులు చర్చించుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏపీకి మరో ముప్పు.. ముంచుకొస్తున్న అల్పపీడనం

శాకాహారిని..నాతో చికెన్ తినిపించారు.. నటి ఫైర్

వచ్చిందమ్మా వయ్యారి.. కారు బానెట్‌లో భారీ కొండచిలువ

Gold Price: బంగారం ధరలు తగ్గబోతున్నాయా

విజయవాడ భవానిపురంలో దారుణం