స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ వద్ద భక్తిశ్రద్ధలతో తిరుమంజనం
ముచ్చింతల్లో శ్రీరామానుజాచార్య స్వామి వారి 1009వ తిరు నక్షత్ర వేడుకలు ఏప్రిల్ 22 నుంచి 26 వరకు జరగనున్నాయి. ఏప్రిల్ 22న ఉదయం 7 గంటలకు సువర్ణ రామానుజమూర్తి తిరుమంజన సేవతో ఈ వేడుకల ప్రారంభం అయ్యాయి. ఇవాళ సాయంత్రం శంషాబాద్ నుంచి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ వరకు రామానుజాచార్యులమూర్తులతో శోభయాత్ర నిర్వహిస్తారు. ఈ వేడుకలకు దేశ, విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.
హైదరాబాద్ సమీపంలోని స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ వద్ద శ్రీభగవద్ రామానుజాచార్య స్వామి వారి విగ్రహానికి తిరుమంజన సేవ భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాలు, పెరుగు, తేనె, నెయ్యి వంటి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహిస్తున్నారు. వేదమంత్రాల నడుమ జరుగుతున్న ఈ సేవలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. పండుగ వాతావరణంలో ఆలయ ప్రాంగణం కళకళలాడుతుండగా, నిర్వాహకులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ తిరుమంజన సేవతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టినట్లు భావిస్తున్న భక్తులు, వచ్చే రోజుల్లో జరిగే కార్యక్రమాలకు కూడా భారీగా హాజరవుతామని తెలిపారు.
Follow Us
