కేసీఆర్ చేసిందే కరెక్ట్.. కాళేశ్వరం ప్రాజెక్టుపై TV9 క్రాస్ ఫైర్లో జీవన్ రెడ్డి కీలక కామెంట్స్
తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడూ ఒక పెద్ద చర్చాంశమే. ఇటీవలే బీఆర్ఎస్లో చేరిన సీనియర్ నేత జీవన్ రెడ్డి.. టీవీ9 క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కాళేశ్వరంపై అవినీతి ఆరోపణలు చేసిన ఆయన..ఇప్పుడు కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అసలు జీవన్ రెడ్డి ఏమన్నారు అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట మరోసారి నిజమైంది. నిన్నటి వరకు కాంగ్రెస్ గొంతుకగా కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని, డిజైన్లన్నీ తప్పని విమర్శలు కురిపించిన మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. ఇప్పుడు గులాబీ కండువా కప్పుకున్నాక తన వాదనను పూర్తిగా మార్చేశారు. టీవీ9 నిర్వహించిన క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఎంత అవసరమో వివరిస్తూ కేసీఆర్ నిర్ణయాన్ని సమర్థించారు. గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు డీపీఆర్ లేదని, డిజైన్లలో లోపాలున్నాయని జీవన్ రెడ్డి తీవ్రంగా విమర్శించేవారు. జ్యుడిషియల్ కమిషన్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు ‘‘ఏ ప్రాజెక్టు పైనైనా ఆరోపణలు చేయడం సులభమే.. కానీ ప్రాజెక్టు నిర్మాణం ముఖ్యం’’ అని అన్నారు. ఆనాడు లక్ష కోట్లతో ప్రాజెక్టును అప్పుడు కట్టకపోతే, ఇప్పుడు దాని విలువ 4 లక్షల కోట్లు అయ్యేదని ఆయన అన్నారు.
తుమ్మడిహట్టి సాధ్యం కాదు.. మేడిగడ్డే దిక్కు
తుమ్మడిహట్టి వద్ద బ్యారేజ్ కడితే ఒకే ఒక లిఫ్ట్తో ఎల్లంపల్లికి నీరు వచ్చే మాట వాస్తవమే అని జీవన్ రెడ్డి అంగీకరించారు. అయితే అక్కడ ఆశించిన స్థాయిలో నీటి లభ్యత లేదని, అందుకే మేడిగడ్డకు మార్చాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. మేడిగడ్డ వద్ద మూడు లిఫ్ట్లు అవసరమైనప్పటికీ, తెలంగాణకు పుష్కలంగా నీరు అందించే ఏకైక మార్గం ఇదేనని, కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం భారమైనదైనప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సరైనదేనని ఆయన సమర్థించారు. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ వైఫల్యాలను కూడా ఆయన ప్రస్తావించారు. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టలేకపోవడం కాంగ్రెస్ వైఫల్యమే అని, అది అద్దం పట్టినట్టు కనిపిస్తోందని విమర్శించారు. కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం వల్లే నేడు సాగునీరు, త్రాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీరుతున్నాయనే భావన ప్రజల్లో తలెత్తిందని ఆయన వెల్లడించారు.
