భారత్-అమెరికా విమాన టికెట్ల ధర పెంపు వెనుక భారీ ఆన్‌లైన్ కుట్ర!

Updated on: Sep 23, 2025 | 11:57 AM

భారత్ నుండి అమెరికాకు విమాన టిక్కెట్ల ధరలు అకస్మాత్తుగా పెరగడం వెనుక ఆన్‌లైన్ కుట్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ట్రంప్ మద్దతుదారులు, ఫోర్‌చాన్ ఫోరం సభ్యులు కలిసి క్లాక్ ద టాయిలెట్ అనే ఆపరేషన్ ద్వారా కృత్రిమ డిమాండ్ సృష్టించి ధరలను పెంచారని సమాచారం. H-1B వీసా దారుల ప్రయాణాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ కుట్ర జరిగిందని తెలుస్తోంది.

భారతదేశం నుంచి అమెరికాకు విమాన ప్రయాణాల టిక్కెట్ల ధరలు విపరీతంగా పెరిగాయి. జాతీయ మీడియా నివేదికల ప్రకారం, ఈ ధర పెంపు వెనుక ఓ భారీ ఆన్‌లైన్ కుట్ర దాగి ఉంది. ట్రంప్ మద్దతుదారులు, ఫోర్‌చాన్ అనే ఆన్‌లైన్ ఫోరం సభ్యులు కలిసి క్లాక్ ద టాయిలెట్ అనే ఆపరేషన్‌ను ప్రారంభించారు. ఈ ఆపరేషన్‌లో వారు వివిధ ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్లలో సీట్లను బుక్ చేసి చెల్లింపులు చేయకుండా 15 నిమిషాల పాటు హోల్డ్ చేశారు. దీనివల్ల కృత్రిమ డిమాండ్ సృష్టించబడి టిక్కెట్ల ధరలు అమాంతం పెరిగాయి. ఉదాహరణకు న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు ఎకానమీ క్లాస్ టిక్కెట్ ధర సాధారణంగా ₹37,000 ఉండగా, ఇప్పుడు ₹80,000 దాటింది. ఈ డిజిటల్ దాడి కారణంగా అనేక మంది భారతీయులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.