Guntur: చంద్రగ్రహణం రోజు కూడా శివాలయం తెరిచే ఉంచి.. ఇదిగో ఇలా…

Updated on: Sep 09, 2025 | 11:48 AM

చంద్రగ్రహణం రోజున సాధారణంగా అన్ని ఆలయాలు మూసివేస్తారని, కానీ ఈ ఆలయం మాత్రం రాత్రంతా తెరిచి ఉంచారని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. “గ్రహణం రోజున గుడి మూసి ఉండాలి. కానీ రాత్రంతా పూజలు జరగడం అనుమానాస్పదం” అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రగ్రహణం రోజున గుంటూరు జిల్లా రెడ్డిపాలెం శివాలయంలో అర్థరాత్రి ప్రత్యేక పూజలు జరగడంతో స్థానికుల్లో భయాందోళనలు చెలరేగాయి. సాధారణంగా చంద్రగ్రహణం రోజున దేవాలయాలు మూసివేయడం ఆనవాయితీ. అయితే ఈ ఆలయాన్ని మాత్రం తెరిచి పూజలు నిర్వహించడంతో గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల చెబుతున్న వివరాల ప్రకారం.. ఆలయంలో అర్థరాత్రి సమయంలో తలపై కుంపటితో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ దృశ్యాలను చూసిన గ్రామస్తులు అవి సాధారణ పూజలు కాదని, క్షుద్ర పూజలు జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ పూజలను నిర్వహించిన అఘోర శ్రీనివాసరావు మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. తాను చేసింది క్షుద్ర పూజలు కాదని.. మృత్యుంజయ హోమం అని చెబుతున్నారు. పైగా గ్రామ ప్రజలకు మంచి జరగాలని ఇలా చేశాం అంటున్నారు. అయితే స్థానిక మహిళలు మాత్రం శ్రీనివాసరావు కుటుంబం క్షుద్ర పూజలే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆయన కుటుంబం గత నెల రోజులుగా శివాలయం పక్కన ఉన్న ఓ ఇంటిలో నివసిస్తున్నారని, అక్కడి నుంచి వింత వాసనలు వస్తున్నాయని చెబుతున్నారు. తక్షణమే ఆ ఇల్లు ఖాళీ చేయించి.. వారిని పంపించి వేయాలని మహిళలు డిమాండ్‌ చేస్తున్నారు. చంద్రగ్రహణం రోజు పూజల అనంతరం భోజనంలో మాంసాహార వంటకాలు వడ్డించారని కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..