తన ల్యాప్‌టాప్‌ను పబ్లిక్ మధ్య పెట్టి వెళ్లాడు.. ఏం జరిగిందంటే

Updated on: Sep 12, 2025 | 12:25 PM

రద్దీ ప్రదేశంలో ఓ ఖరీదైన ల్యాప్‌టాప్‌ను అరగంట పాటు వదిలేస్తే ఏమవుతుంది? కచ్చితంగా మాయమవుతుంది. కానీ చైనాలో ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు పూర్తి భిన్నమైన అనుభవం ఎదురైంది. అక్కడి ప్రజా భద్రత, ప్రజల నమ్మకాన్ని పరీక్షించేందుకు అతను చేసిన ఓ ప్రయోగం ఇప్పుడు వైరల్‌గా మారింది. టించో అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇటీవల చైనాలో ఈ సామాజిక ప్రయోగాన్ని చేపట్టాడు.

ఒక పబ్లిక్ ప్రదేశంలో తన ల్యాప్‌టాప్‌ను టేబుల్‌పై పెట్టి, 30 నిమిషాల పాటు దాన్ని అక్కడే వదిలేసి వెళ్లాడు. ఆశ్చర్యకరంగా, తిరిగి వచ్చి చూసేసరికి ల్యాప్‌టాప్‌ను ఎవరూ దొంగిలించలేదు, కనీసం ముట్టుకోలేదు కూడా. ఈ మొత్తం ఘటనను వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. “పారిస్‌లో అయితే ఇలాంటిది ఊహించడం కష్టం. కానీ చైనాలో భద్రత, ప్రజల నమ్మకం చాలా భిన్నంగా ఉన్నాయి” అని తన పోస్ట్‌కి కాప్షన్ పెట్టాడు. ఇది తన అజాగ్రత్త కాదని, చైనాలోని సామాజిక పరిస్థితులను, తక్కువ నేరాల రేటును గమనించడానికే ఈ ప్రయోగం చేశానని టించో వివరించాడు. “ఈ ప్రయోగం కేవలం అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కాదు, ఇక్కడి భద్రత, సామాజిక నిబంధనలు ఎలా ఉన్నాయో అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికే” అని అతను తెలిపాడు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు తమ దేశాల్లోని పరిస్థితులతో పోలుస్తూ కామెంట్లు పెడుతున్నారు. “బ్రెజిల్‌లో అయితే ల్యాప్‌టాప్‌తో పాటు కుర్చీ, టేబుల్ కూడా ఎత్తుకెళతారు” అని ఒక యూజర్ వ్యాఖ్యానించగా, “దక్షిణాఫ్రికాలో అయితే దాన్ని కింద పెట్టాల్సిన అవసరం కూడా లేదు, చేతుల్లోంచే లాక్కుపోతారు” అని మరొకరు రాశారు. మరోవైపు, కొలంబియాకు చెందిన ఓ వ్యక్తి తన అనుభవాన్ని పంచుకుంటూ, తను చైనాలోని ఓ రెస్టారెంట్‌లో 10,000 యువాన్లతో తన వాలెట్, ఫోన్ మర్చిపోయాననీ 8 గంటల తర్వాత వెళితే అన్నీ అక్కడే ఉన్నాయనీ తెలిపాడు. అప్పటి నుంచి బీజింగ్ అంటే తనకు చాలా ఇష్టమని కామెంట్ చేశాడు. ఈ ప్రయోగం వివిధ దేశాల్లోని ప్రజా జీవితంలో భద్రత, నమ్మకంపై కొత్త చర్చను రేకెత్తించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జాక్ పాట్ కొట్టిన ఇమ్మాన్యుయేల్! బిగ్ బాస్‌ నుంచి మనోడికి దిమ్మతిరిగే రెమ్యునరేషన్‌