ఈఎంటీ సాహసం.. అంబులెన్స్‌లోనే ప్రసవం.. తర్వాత!

Updated on: Jul 15, 2026 | 8:27 PM

ములుగు జిల్లా వాజేడు మండలంలోని మారుమూల గిరిజన గ్రామానికి చెందిన గర్భిణి మంజుకు ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్స్‌లోనే పురిటినొప్పులు తీవ్రం అయ్యాయి. ఈఎంటీ మానస సమయస్ఫూర్తితో వ్యవహరించి అంబులెన్స్‌లోనే సురక్షితంగా కవల శిశువులకు ప్రసవం చేశారు. అనంతరం తల్లి, ఇద్దరు చిన్నారులను ఆసుపత్రికి తరలించగా అందరూ క్షేమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు, వైద్యులు ఈఎంటీ సేవలను ప్రశంసించారు.

ఓ ఈఎంటీ సమయస్పూర్తి, ధైర్యం, మానవత్వం..వెరసి ఓ మహిళకు అంబులెన్స్‌లోనే సుఖప్రసవానికి దారితీసింది. మానవత్వాన్ని, కర్తవ్య దీక్షను చాటే ఈ అద్భుత ఘటన ములుగు జిల్లాలో జరిగింది. వాజేడు మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతమైన ములకపల్లి గ్రామానికి చెందిన తెల్లం మంజు అనే గర్భిణీ , ఆసుపత్రికి వెళ్లే మార్గమధ్యంలో అంబులెన్స్‌లోనే కవల పిల్లలకు జన్మనిచ్చింది. మంజు, నాగేష్ దంపతులకు ఇప్పటికే ముగ్గురు సంతానం ఉండగా, నాలుగో ప్రసవం కోసం నెలలు నిండడంతో మంజుకు తీవ్రమైన పురిటినొప్పులు వచ్చాయి. మారుమూల ప్రాంతం కావడంతో ఆసుపత్రికి వెళ్లడం కష్టతరమైనా, సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ప్రాణాలకు తెగించి గ్రామానికి చేరుకున్నారు. నొప్పులతో బాధపడుతున్న మంజును అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా, సుమారు 7 కిలోమీటర్ల దూరం రాగానే ఆమెకు నొప్పులు మరింత ఎక్కువయ్యాయి. పరిస్థితి విషమిస్తోందని గమనించిన అంబులెన్స్ ఈఎంటీ మానస సమయస్ఫూర్తితో వ్యవహరించారు. అత్యంత సాహసంతో, ఓర్పుతో అంబులెన్స్‌లోనే గర్భిణీకి ప్రాథమిక చికిత్స అందిస్తూ ప్రసవం చేశారు. మంజు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇద్దరు భీముడి లాంటి ఆరోగ్యకరమైన కవల పిల్లలకు జన్మనిచ్చింది. సుఖప్రసవం కావడంతో అటు సిబ్బంది, ఇటు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం తల్లి, పిల్లలను సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు. ఆపత్కాలంలో దేవతలా మారి ఇద్దరు బిడ్డలను, తల్లిని కాపాడిన ఈఎంటీ మానస చొరవపై వైద్యులు, బాధిత కుటుంబ సభ్యులు మరియు నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో

ఫోన్‌లో బిజీగా ఉన్న షాపు యజమాని.. ఓ కిలాడీ లేడీ ఏం చేసిందో చూడండి!

ఆ గ్రామంలో వరుస మరణాలు.. భయంతో స్థానికులు ఏం చేశారంటే!

కోడలికి కొత్త జీవితం ఇచ్చిన మామ! నువ్వు సూపర్‌..

Follow Us