ఏపీలో భిక్షాటనపై పూర్తి నిషేధం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ కొత్త చట్టం తీసుకు వచ్చింది. ఈ మేరకు తీసుకొచ్చిన 'భిక్షాటన నివారణ సవరణ చట్టం-2025'కు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ఇది అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా నిరుపేదలకు పునరావాసం కల్పించి, గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ గెజిట్లో ప్రచురించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భిక్షాటన చేయడం చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు. 1977 నాటి భిక్షాటన నిషేధ చట్టంలో ప్రభుత్వం ముఖ్యమైన సవరణలు చేసింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ సూచనల మేరకు, చట్టంలో ఉన్న లెప్పర్, ల్యూనాటిక్ వంటి అభ్యంతరకరమైన పదాలను తొలగించింది. ఈ పదాలు కుష్టు, మానసిక వ్యాధిగ్రస్థులను కించపరిచేలా ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడింది. ఈ సూచనను స్వీకరించిన ప్రభుత్వం, ‘లెప్పర్’ స్థానంలో ‘కుష్టు వ్యాధి సోకిన వ్యక్తి’ అని, ‘ల్యూనాటిక్’ స్థానంలో ‘మానసిక వ్యాధిగ్రస్థుడు’ అని మార్పులు చేసింది. శాసనసభ, మండలిలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన ఈ సవరణలకు గవర్నర్ కూడా ఆమోదం తెలపడంతో జీవో జారీ అయింది. రాష్ట్రంలో భిక్షాటన ఒక వ్యవస్థీకృత మాఫియాగా మారిందని ప్రభుత్వం గుర్తించింది. ఈ పరిస్థితిని అరికట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. కొత్త చట్టం అమలు బాధ్యతను సంక్షేమ, పోలీసు శాఖలకు అప్పగించింది. భిక్షాటన చేసే నిరుపేదలు, నిస్సహాయులకు పునరావాసం కల్పించి, వారికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బురద మీద పడిందని ఇలా బుద్ధి చెప్పింది..
వేలానికి బంగారు టాయిలెట్.. ధర ఎంతో తెలుసా
చేపల కోసం వలవేస్తే.. ఏం చిక్కాయో చూడండి
