ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తెలంగాణలో 1200కోట్ల మేర విద్యుత్ చార్జీల పెంపునకు ప్రభుత్వ అనుమతి కోరుతూ డిస్కంలు ప్రతిపాదనలు పంపాయి. హైటెన్షన్ కేటగిరీ విద్యుత్ చార్జీల పెంపు.. లోటెన్షన్ చార్జీల పెంపు పేరుతో డిస్కంలు ప్రతిపాదించాయి. హెచ్టీ కేటగిరీకి చార్జీల పెంపుతో 700కోట్లు.. ఫిక్స్డ్ చార్జీల పెంపుతో 100కోట్లు కలిపి 800కోట్ల భారం పడనుంది. మరో 400కోట్లను ఎల్టీ వినియోగదారుల నుంచి ఫిక్స్డ్ చార్జీల పెంపుతో రాబట్టుకుంటామని డిస్కంలు ప్రతిపాదనలో పేర్కొన్నాయి.
కరెంట్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజలపై కోట్ల రూపాయల భారం మోపాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు ఆ పార్టీ నేతలు. కరెంట్ చార్జీల పెంపు ప్రతిపాదనను తిరస్కరించాలని కోరుతూ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ను కోరారు. అలాగే తమ వాదనల్ని వినిపించారు. ఒకేసారి ప్రజలపై ఇంత భారం మోపడం దారుణమన్నారు కేటీఆర్. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగం వరకు అన్నీ సంక్షోభంలో కూరుకుపోయాయని ఆరోపించారు. పారిశ్రామిక రంగానికి చెందిన అన్ని కేటగిరీలకు ఒకే రేటు నిర్ణయించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఫిక్స్డ్ ఛార్జీల పేరుతో గృహ వినియోగదారులపై భారం మోపే ప్రయత్నం సరికాదన్నారు కేటీఆర్.
ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపేలా రాష్ట్ర విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన 9 వేర్వేరు పిటిషన్లపై ఈఆర్సీ బహిరంగ విచారణ చేపట్టింది. మండలి చైర్మన్ శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్ రాజు, కృష్ణయ్యల ఐదేళ్ల పదవీకాలం ఈనెల 29తో ముగియనుంది. ఈలోపే ఈఆర్సీ కీలక నిర్ణయాలు తీసుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. అయితే డిస్కంల ప్రతిపాదనలకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. నవంబర్ 1 నుంచి చార్జీల పెంపు అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..