Shadnagar: ఉలిక్కిపడ్డ షాద్నగర్.. భారీ పేలుడు.. ఆరుగురు మృతి.. ముక్కముక్కలైన మృతదేహాలు
షాద్నగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సౌత్ గ్లాస్ కంపెనీలో గ్యాస్ ఫర్నేస్ పేలుడు.. భయభ్రాంతులకు గురిచేసింది. పక్కరాష్ట్రాల నుంచి పొట్టకూటి కోసం వచ్చిన వారిని పొట్టన పెట్టుకుంది. భారీ పేలుడికి కార్మికులు పిట్టల్లా రాలిపోయారు. ఘటనా స్థలంలోని విషాదకర దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందడం, 10 మందికి గాయాలవ్వడంతో.. షాద్నగర్లో..
![Shadnagar: ఉలిక్కిపడ్డ షాద్నగర్.. భారీ పేలుడు.. ఆరుగురు మృతి.. ముక్కముక్కలైన మృతదేహాలు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/huge-explosion.jpg?w=1280)
షాద్నగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సౌత్ గ్లాస్ కంపెనీలో గ్యాస్ ఫర్నేస్ పేలుడు.. భయభ్రాంతులకు గురిచేసింది. పక్కరాష్ట్రాల నుంచి పొట్టకూటి కోసం వచ్చిన వారిని పొట్టన పెట్టుకుంది. భారీ పేలుడికి కార్మికులు పిట్టల్లా రాలిపోయారు. ఘటనా స్థలంలోని విషాదకర దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందడం, 10 మందికి గాయాలవ్వడంతో.. షాద్నగర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. చెల్లాచెదురుగా మృతదేహాలు.. ఎటు చూసినా రక్తపు ముద్దలు.. శరీరం ఒక దగ్గర, కాళ్లు చేతులు మరో దగ్గర. ఏ డెడ్బాడీని చూసినా ఇదే పరిస్థితి. పొట్టకూటి కోసం రాష్ట్రాల దాటిన వాళ్లు.. ఇప్పుడు లోకాన్నే విడిచివెళ్లిపోయారు. పిల్లల భవిష్యత్తు కోసం ఉన్న ఊరిని, కన్నవారిని వదిలిపెట్టారు. కష్టాన్ని నమ్ముకుని రాష్ట్రంగానీ రాష్ట్రం వచ్చారు. పాపం వాళ్లకేం తెలుసు.. మృత్యువు ఈ రూపంలో వాళ్ల ఉసురు తీసుకుంటుందని.. కుటుంబాలను రోడ్డున పడేస్తుందని. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో గ్యాస్ ఫర్నేస్ పేలుడు… తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గ్లాస్ కంపెనీ కావడంతో మృతదేహాలు చిధ్రమయ్యాయి. ఒక్కసారిగా పేలింది. గ్లాస్ కంపెనీ కావడంతో కార్మికుల మృతదేహాలు చిధ్రం అయ్యాయి. ఘటనా స్థలంలో శరీరభాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.
ఫ్యాక్టరీలో గ్యాస్ కంప్రెష్ చేస్తుండగా పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. మృతులు ఒడిశా, బీహార్ యూపీ వాసులుగా గుర్తించారు. పేలుడు ధాటికి కంపెనీకి చెందిన షెడ్ కుప్పకూలింది. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఈ దుర్ఘటన ఎలా జరిగిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు పలువురు స్థానిక నాయకులు సైతం ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
పొట్టకూటి కోసం సొంత రాష్ట్రాన్ని వదిలి వచ్చిన వారే ఈ ప్రమాదంలో బలయ్యారు. పేలుడు దాటికి మాంసపు ముద్దల్లా ఎగిరి పడ్డారు. దీంతో ఘటనా స్థలానికి వచ్చిన వారి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా అయిపోయిందంటూ కొందరి రోధనలు గుండెల్ని పిండేస్తున్నాయి. ఒకరిద్దరు యువకులు సైతం ఈ బ్లాస్ట్లో ప్రాణాలు కోల్పోవడం.. కలచివేస్తోంది. ఇక ప్రమాద సమయంలో కంపెనీలో 150 మంది కార్మికులు ఉన్నారు. పేలుడు గురించి వాళ్లు చెబుతుంటే అధికారులే బెంబేలెత్తిపోతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సైతం ఘటనపై స్పందించింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా.. షాద్నగర్ ప్రమాదంలో కష్టాన్ని నమ్కుకున్న కార్మికుడు బలయ్యాడు. తమనే నమ్ముకున్న కుటుంబాలకు కన్నీరు మిగిల్చారు.
అధికారులకు సీఎం రేవంత్రెడ్డి కీలక ఆదేశాలు
ఈ పేలుడు ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు చేపట్టాలని ప్రమాద స్థలంలో ఉన్న కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ, కార్మిక, పరిశ్రమలు, వైద్య బృందాలు ఘటనా స్థలిలోనే ఉండి సమన్వయంతో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు.