Goa: గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి గోవాకు డైరెక్ట్ ట్రైన్
తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా) వరకు కొత్త ఎక్స్ప్రెస్ రైలు ను నడపనున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్-గోవా మధ్య రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయని, సీట్లు దొరక్క చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి మార్చిలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు లేఖ రాశారు.
గోవా అనేది మన దేశంలో ఫేమస్ టూరిస్ట్ స్పాట్. తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు గోవాకు తెలంగాణ నుంచి డైరెక్ట్ ట్రైన్ లేదు. సికింద్రాబాద్ నుంచి వీక్లీ సర్వీసు, కాచిగూడ నుంచి నాలుగు బోగీల(సాధారణ, ఏసీ, స్లీపర్)సర్వీసు గుంతకల్ వద్ద గోవా ట్రైన్తో లింకై వెళ్లేవి. ఇది కొంచెం ప్రయాసతో కూడిన ప్రయాణమే. అయితే.. తాజాగా దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లేలా సర్వీసును అందుబాటులోకి తెస్తోంది. వారం రోజుల్లోనే ఈ సర్వీసు అందుబాటులోకి రానుంది. ఈట్రైన్ సికింద్రాబాద్, కాచిగూడ, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ… వాస్కోడగామా చేరుకోనున్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్ – గోవా మధ్య నడిచే ట్రైన్లలో అస్సలు ఖాళీ ఉండటం లేదు. ప్రయాణికులు సీట్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు మార్చిలో లేఖ రాశారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ ప్రతిపాదన హోల్డ్లో పడింది. ఇటీవల రైల్వేశాఖ మంత్రిని కలిసిన కిషన్రెడ్డి ఈ ప్రాజెక్టు విషయాన్ని గుర్తుచేశారు. దీనిపై అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించి.. ట్రైన్ సర్వీసు అందుబాటులోకి తెచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో బుధ, శుక్ర వారాల్లో సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామకు… గురు, శనివారాల్లో రిటన్లో సికింద్రాబాద్కు సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నారు. టిక్కెట్ ధరలను అతి త్వరలో వెల్లడించనున్నారు.
కాగా ఏటా దాదాపు 80 లక్షల మంది స్వదేశీ టూరిస్టులు గోవాను వెళ్తుండగా.. ఇందులో.. 20 శాతం మంది తెలుగు రాష్ట్రాలవారే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.