Telangana: పెద్దపల్లిలో విజయ నిర్ణేతలు వీళ్లే.. ప్రచారంలో జోరు పెంచిన ప్రధాన పార్టీలు..
సింగరేణి ఓట్ల పై దృష్టి పెట్టిన ప్రధాన పార్టీ అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు. పేరుకు తగ్గట్టే అది పెద్ద పార్లమెంటు నియోజకవర్గం. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లతో విస్తరించి ఉన్న ఆ నియోజకవర్గంలో సింగరేణి కార్మిక కుటుంబాల ఓట్లే కీలకం. దీంతో కార్మిక కుటుంబాలను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాలను వారు ముమ్మరంగా చేస్తున్నారు. కార్మికుల ప్రధాన సమస్యలను ఎజెండాలుగా ఎంచుకొని ముందుకు సాగుతున్నారు. ఉత్తర తెలంగాణలోని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పోరు రసవత్తరంగా కొనసాగుతోంది.
సింగరేణి ఓట్ల పై దృష్టి పెట్టిన ప్రధాన పార్టీ అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు. పేరుకు తగ్గట్టే అది పెద్ద పార్లమెంటు నియోజకవర్గం. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లతో విస్తరించి ఉన్న ఆ నియోజకవర్గంలో సింగరేణి కార్మిక కుటుంబాల ఓట్లే కీలకం. దీంతో కార్మిక కుటుంబాలను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాలను వారు ముమ్మరంగా చేస్తున్నారు. కార్మికుల ప్రధాన సమస్యలను ఎజెండాలుగా ఎంచుకొని ముందుకు సాగుతున్నారు. ఉత్తర తెలంగాణలోని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పోరు రసవత్తరంగా కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కాకా వెంకటస్వామి మనుమడు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణ పోటీ చేస్తుండగా, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. బిజెపి అభ్యర్థిగా గోమాస. శ్రీనివాస్ రెండవసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతున్నారు. ఈ ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రజల్లో పట్టు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే, కీలకమైన సింగరేణి కార్మిక కుటుంబాల మద్దతుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదు అసెంబ్లీ సెగ్మెంట్ల ఫలితాలను ప్రభావితం చేసే సత్తా సింగరేణి కార్మికులది.
ఈ విషయాన్ని గ్రహించిన ప్రధాన పార్టీలు, సింగరేణి కార్మిక కుటుంబాల మద్దతు కోసం విస్తృతంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లను గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోవడం, ఇటీవల జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ INTUC సత్తా చాటుకోవడం, సింగరేణి గుర్తింపు సంఘమైన AITUC మద్దతును ప్రకటించడం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి అనుకూలించే అంశాలుగా ఆ పార్టీ అంచనా వేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొప్పుల ఈశ్వర్ స్వతహాగా సింగరేణి కార్మికుడు కావడం, కార్మిక ఉద్యమాలలో చురుకైన పాత్రను పోషించిన చరిత్రను కలిగి ఉండడం ఆయన గెలుపుకు లాభించే అంశాలుగా బీఆర్ఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇంకోవైపు బిజెపి అభ్యర్థి కూడా సింగరేణి కార్మిక కుటుంబాల మద్దతు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో గెలుపు ఓటములను నిర్ధారించే సింగరేణి కార్మికులు అంతిమంగా ఎటువైపు మొగ్గుచూపుతారనే అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..