అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం.. ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు
బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్లోని బల్కంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే వేదమంత్రోచ్ఛారణలు, ప్రత్యేక పూజలు, ఎదుర్కోలు ఉత్సవాలతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనుండగా, అనంతరం రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొననున్నారు.
తెలంగాణలో బోనాల జాతర జరిగే సమయంలోనే బల్కంపేట రేణుక ఎల్లమ్మ కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మంగళవారం ఉదయం నుంచే ఆలయంలో పండితుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారికి శాస్త్రోక్తంగా ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించిన అనంతరం ప్రధాన కల్యాణ ఘట్టం వైభవంగా జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. కల్యాణ మహోత్సవం అనంతరం రేపు అమ్మవారి ‘రథోత్సవం’ జరగనుంది. ఆలయ పరిసర ప్రాంతాలు మరియు వీధుల గుండా సాగే ఈ రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోనున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు..
దీంతో బల్కంపేట మార్గంలో రెండు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆ మార్గంలో వాహనాలను అనుమతించరు.. దీంతో పాటు.. బాల్కాంపేట ఎల్లమ్మతల్లీ ఆలయ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బల్కంపేట ఆలయానికి వెళ్లే భక్తులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించడం మంచిది. రద్దీ కారణంగా వ్యక్తిగత వాహనాల కంటే మెట్రో లేదా ప్రజా రవాణా సేవలను ఉపయోగిస్తే సౌకర్యంగా ఉంటుంది. చిన్నారులు, వృద్ధులతో వచ్చే భక్తులు తాగునీరు, అవసరమైన మందులు వెంట తీసుకెళ్లి అధికారుల సూచనలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
