‘తెలంగాణ ఉన్నంతవరకు బీఆర్ఎస్ ఉంటుంది’.. మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..

|

Apr 01, 2024 | 4:15 PM

వరంగల్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.కడియం శ్రీహరి పార్టీలో నుంచి బయటకు పోయాక జోష్ కనిపిస్తోందన్నారు. పదవులను, కూతురికి టికెట్‌ను తీసుకుని పార్టీకి ద్రోహం చేసిన శ్రీహరికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి కార్యకర్తల్లో కనిపిస్తోందన్నారు.

తెలంగాణ ఉన్నంతవరకు బీఆర్ఎస్ ఉంటుంది.. మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
Harish Rao
Follow us on

వరంగల్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.కడియం శ్రీహరి పార్టీలో నుంచి బయటకు పోయాక జోష్ కనిపిస్తోందన్నారు. పదవులను, కూతురికి టికెట్‌ను తీసుకుని పార్టీకి ద్రోహం చేసిన శ్రీహరికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి కార్యకర్తల్లో కనిపిస్తోందన్నారు. పార్టీ మారేదే లేదని చెప్పిన శ్రీహరి ఇప్పుడు ఎందుకు మారారో సమాధానం చెప్పాలని అడిగారు. కడియంకు నైతిక విలువలు ఉంటే బీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు పడిపోతున్నాయి.. అలాంటి పార్టీలోకి శ్రీహరి వెళ్లారని ఎద్దవా చేశారు. కష్టపడే కార్యకర్తలకు తప్పక గుర్తింపు ఉంటుంది.. ద్రోహం చేసినవాళ్లను మళ్లీ చేర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వరంగల్ తొలి నుంచి ఉద్యమాల గడ్డ అని.. బీఆర్ఎస్‌కు అండగా ఉందన్నారు. ఇలాంటి గడ్డలో పనిచేసే కార్యకర్తల కాళ్లు కడిగి నెత్తిమీద చల్లుకున్నా తక్కువే అని కొనియాడారు. వరంగల్ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ ఎంతో కృషి చేసింది. ఐదు మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటన్, టెక్స్ టైల్ పార్క్ తెచ్చామని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నంలోని కాకతీయ తోరణాన్ని తీసేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు.. అదే జరిగితే వరంగల్ అగ్నిగుండమవుతుందని హెచ్చరించారు. కాకతీయ తోరణం వరంగల్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలిపారు. కాంగ్రెస్ చెప్పిన ఆరుగ్యారెంటీలు, హామీలు అమలు అయి ఉంటే కాంగ్రెస్ కు ఓటు వేయండి, కాకపోతే బీఆర్ఎస్ కు ఓటు వేయండని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దు. కష్టాలు మనకు కొత్తకాదని ధైర్యం చెప్పారు. హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు వివరించి చెప్పండని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీపై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. తాము బీజేపీతో చేతులు కలిపి ఉంటే కవిత ఎందుకు జైలుకు పోతుందని వివరించారు. బీజేపీతో కలిస్తే జోడీ, లేకుంటే ఈడీ అంటూ విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. దానికి ఓటు వేయడం వ్యర్థం అని ఈ సందర్భంగా తెలిపారు. మైనారిటీల సంక్షేమం కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారని.. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మీ గొంతును చట్టసభల్లో వినిపిస్తామన్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని అంటున్నారు.. కానీ తెలంగాణ ఉన్నంతవరకు బీఆర్ఎస్ ఉంటుందని చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..