Telangana: ఈ నియోజకవర్గంలో బాబాయ్ వర్సెస్ అబ్బాయి.. ఎన్నికల ప్రచారంలో ఇరుపార్టీల జోరు..

| Edited By: Srikar T

Apr 13, 2024 | 12:07 PM

ప్రస్తుతం ఎన్నికలు అనేక ఆసక్తికర పరిణామాలకు వేదికలవుతున్నాయి. బంధుత్వాలు, బంధాలు మరచి ప్రజాక్షేత్రంలో నువ్వా.. నేనా అంటున్నారు నేతలు. అలాంటి ఆసక్తికరపరిణామాలకు పాలమూరు పార్లమెంట్ పోరు వేదికయ్యింది. బాబాయ్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటే.. అబ్బాయ్ మాత్రం ఆయనకు వ్యతిరేకంగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి కోసం పనిచేస్తున్నారు. ఎవరా బాబాయ్, అబ్బాయ్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Telangana: ఈ నియోజకవర్గంలో బాబాయ్ వర్సెస్ అబ్బాయి.. ఎన్నికల ప్రచారంలో ఇరుపార్టీల జోరు..
Palamuru Lok Sabha
Follow us on

ప్రస్తుతం ఎన్నికలు అనేక ఆసక్తికర పరిణామాలకు వేదికలవుతున్నాయి. బంధుత్వాలు, బంధాలు మరచి ప్రజాక్షేత్రంలో నువ్వా.. నేనా అంటున్నారు నేతలు. అలాంటి ఆసక్తికరపరిణామాలకు పాలమూరు పార్లమెంట్ పోరు వేదికయ్యింది. బాబాయ్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటే.. అబ్బాయ్ మాత్రం ఆయనకు వ్యతిరేకంగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి కోసం పనిచేస్తున్నారు. ఎవరా బాబాయ్, అబ్బాయ్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

పార్లమెంట్ ఎన్నికల వేళ పాలమూరులో ఆసక్తికరమైన రాజకీయపరిణామాలకు చోటుచేసుకుంటున్నాయి. బాబాయ్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటే.. అబ్బాయ్ మాత్రం ఆయనకు వ్యతిరేకంగా ఇంకో పార్టీలో పనిచేస్తున్నారు. నేరుగా ప్రత్యర్థులు కాకపోయిన బాబాయ్‎కు వ్యతిరేకంగా అబ్బాయ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మహబూబ్‎నగర్ సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి మరోసారి గులాబీ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే ఆయన సొంత అన్న కుమారుడు మన్నే జీవన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్‎లో చేరి బాబాయ్‎కు వ్యతిరేకంగా ప్రచారానికి సిద్ధం అవుతున్నారు. మన్నే జీవన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందువరకు బీఆర్ఎస్‎వైపే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ సైతం ఆశించారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతర పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవలే జరిగిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ సైతం చేశారు. ప్రస్తుతం ఆ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

అయితే గత ఎంపీ ఎన్నికల్లో బాబాయ్ గెలుపు కోసం కీలక పాత్ర పోషించిన అబ్బాయ్ ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ వైపు ఉండడం గమనార్హం. రేపో మాపో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి బాబాయ్ మన్నే శ్రీనివాస్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో అబ్బాయ్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి విజయం కోసం ప్రచారం చేయకుండా ఉండలేని పరిస్థితి. అందులోనూ మన్నే జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించడంతో ఆయన సేవలను పార్లమెంట్ పరిధిలోని జడ్చర్ల అసెంబ్లీ సెగ్మెంట్‎లో వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీంతో అధిష్టానం మాట వినక తప్పని పరిస్థితి జీవన్ రెడ్డికి ఎదురవుతోంది. ఇన్ని రోజులు వ్యాపారవేత్త మన్నే సత్యనారాయణ రెడ్డి కుటుంబం అంటేనే ఉమ్మడిగా ఉండేది. కానీ కుటుంబ సభ్యుల రాజకీయ ప్రవేశం నేపథ్యంలో ఎన్నికల బరిలో ఇంటిపోరు తప్పేలా లేదు. కాంగ్రెస్ అభ్యర్థి తరఫున అబ్బాయ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా బాబయ్ ఈ ఆసక్తికరమైన పోరులో ఎవరిదిపై చేయి తెలియాలంటే ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చేవరకు వేచిచూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..