మహబూబ్నగర్ స్థానంపై కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టాయి. సొంత అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్ మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోనే ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్గా తీసుకున్నారు. భారీ మెజారిటీ లక్ష్యంగా కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ సైతం ఈ దఫా పార్లమెంట్ బరిలో విజయం సాధించేలా, ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గంలో మెజారిటీ సాధించాలన్న పట్టుదలతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం రెండు జాతీయ పార్టీలకు హాట్ సీట్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇన్నిరోజులు ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిస్తే, తాజాగా సీన్ లోకి సీఎం రేవంత్ రెడ్డి ఎంటర్ కావడంతో మరింత ఇంట్రెస్టింగ్గా పాలమూరు రాజకీయాలు మారిపోయాయి. మహబూబ్నగర్ లో నువ్వా నేనా అన్నట్లు పోటా పోటీ పాలిటిక్స్ రాష్ట్ర వ్యాప్తంగా కాక రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ ఎంపీ స్థానాల్లో హస్తం జెండా ఎగురవేసిందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సొంత అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్ లో మండలాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నారు. ఒక్క కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే 50వేల మెజారిటీని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. అలాగే పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో సభలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 15వ తేదీన నారాయణపేట నియోజకవర్గంలో తలపెట్టిన జన జాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.
ఇక ఈసారి పార్లమెంట్ పోరును బీజేపీ అభ్యర్థి డీకే అరుణ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందుకోసం జిల్లాపై ఉన్న పట్టును, సుధీర్ఘ రాజకీయ అనుభవాన్ని రంగరిస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో పాగా వేయాలని, అక్కడి నుంచే మెజారిటీ ఓట్లు సాధించాలని లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కి పట్టున్న కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి కార్యకర్తలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇరు పార్టీలు మహబూబ్ నగర్ సీట్ ను కైవసం చేసుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. ఇక త్వరలోనే జాతీయ నేతలను సైతం రంగంలోకి దింపి రాజకీయాలను మరింత హీటెక్కించేందుకు సిద్దమవుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..