రైతుల ఆందోళనలపై సుప్రీంకోర్టులో విచారణ.. ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అన్నదాతలు
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలపై సుప్రీం కోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. దీనితోపాటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి నూతన సాగు చట్టాలను వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లపై..
Supreme Court to Hear Pleas : ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలపై సుప్రీం కోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. దీనితోపాటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి నూతన సాగు చట్టాలను వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లపై కూడా విచారణ జరుపనుంది. రైతులతో కేంద్రం 8 దఫాల చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వని తరుణంలో సుప్రీం కోర్టు విచారణకు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈనెల 6న జరిగిన విచారణలో రైతుల ఆందోళన విషయంలో క్షేత్రస్థాయిలో ఎలాంటి పురోగతి తమకు కనిపించటం లేదని సీజేఐ జస్టిస్ బోబ్డే వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రైతులు-కేంద్రం మధ్య చర్చలు జరుగుతున్నాయని అటార్నీ జనరల్ కే.కే. వేణుగొపాల్ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. సమీప భవిష్యత్తులో ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ తరుణంలో.. సాగు చట్టాలపై దాఖలైన పిటిషన్లపై కేంద్రం తన స్పందనను అందిస్తే.. రైతులు-ప్రభుత్వం మధ్య సంప్రదింపులు దెబ్బతినే అవకాశముందని పేర్కొన్నారు. ఈ క్రమంలో జనవరి 11కు వాయిదా వేసింది ధర్మాసనం.
నూతన వ్యవసాయ చట్టాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న కేసుల్లో తమను క్షక్షిదారుగా చేర్చాలంటూ భారతీయ రైతు సంఘాల కన్సార్టియం గత శనివారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ సంస్కరణలు రైతులకు ప్రయోజనకరమని పేర్కొంది. ఈ విషయంపై అభిప్రాయం తెలిపేందుకు ఇతర రైతు సంఘాలకు అవకాశం ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరింది.