హథ్రాస్ కేసులో సీబీఐ దర్యాప్తును అలహాబాద్ హైకోర్టు పర్యవేక్షిస్తుంది ః సుప్రీం
హథ్రాస్ ఘటనపై సీబీఐ చేస్తున్న దర్యాప్తును పర్యవేక్షించాల్సిందిగా అలహాబాద్ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.. ఉత్తరప్రదేశ్లోని హథ్రాస్ జిల్లా బుల్గారి గ్రామంలో దళిత అమ్మాయిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆపై తీవ్రంగా హింసించి ఆమె చావుకు కారకులయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో దాఖలైన దరఖాస్తులపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.. ఈ కేసుకు సంబంధించి సీబీఐ జరుపుతున్న దర్యాప్తును ఎప్పటికప్పుడు అలహాబాద్ హైకోర్టు పర్యవేక్షిస్తుందని సుప్రీం తెలిపింది. కేసును ఢిల్లీకి బదిలి చేయాలనే అంశాన్ని […]
హథ్రాస్ ఘటనపై సీబీఐ చేస్తున్న దర్యాప్తును పర్యవేక్షించాల్సిందిగా అలహాబాద్ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.. ఉత్తరప్రదేశ్లోని హథ్రాస్ జిల్లా బుల్గారి గ్రామంలో దళిత అమ్మాయిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆపై తీవ్రంగా హింసించి ఆమె చావుకు కారకులయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో దాఖలైన దరఖాస్తులపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.. ఈ కేసుకు సంబంధించి సీబీఐ జరుపుతున్న దర్యాప్తును ఎప్పటికప్పుడు అలహాబాద్ హైకోర్టు పర్యవేక్షిస్తుందని సుప్రీం తెలిపింది. కేసును ఢిల్లీకి బదిలి చేయాలనే అంశాన్ని తర్వాత పరిశీలిస్తామని తెలిపింది.. సీబీఐ తన దర్యాప్తును పూర్తి చేసిన అనంతరం కేసు బదిలీపై నిర్ణయం తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు సీబీఐ తన దర్యాప్తు వివరాలను అలహాబాద్ హైకోర్టుకు అందచేయాల్సి ఉంటుంది.. ఇక ఈ కేసుకు సంబంధించి బాధిత కుటుంబ భద్రతను, సాక్షుల భద్రతను అలహాబాద్ హైకోర్టు చూసుకుంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఇక హథ్రాస్ కేసుకు సంబంధించిన ఆదేశాలలో బాధితురాలి పేరును తొలగించాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న విన్నపాన్ని సుప్రీం మన్నించింది. బాధితురాలి పేరును తొలగించాలని అలహాబాద్ హైకోర్టుకు సూచించింది. ఈ నెల 15న జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసింది.