
FIFA World Cup 2026: ఫుట్బాల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2026 ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2026) బహుమతి మొత్తానికి సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ఈ మెగా టోర్నీలో విజేతగా నిలిచే జట్టుకు ఏకంగా 50 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 451 కోట్లు) లభించనున్నాయి. గత ప్రపంచకప్తో పోలిస్తే ఈసారి ప్రైజ్ మనీని భారీగా పెంచడం విశేషం.
దోహాలో జరిగిన ఫిఫా కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2022లో ఖతార్ వేదికగా జరిగిన ప్రపంచకప్లో మొత్తం ప్రైజ్ పూల్ 440 మిలియన్ డాలర్లుగా ఉండగా, ఈసారి దాదాపు 50 శాతం పెంచి 655 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 5,912 కోట్లు) చేర్చారు.
విజేత జట్టు: రూ. 451 కోట్లు ($50M) – 2022లో అర్జెంటీనాకు లభించిన రూ. 347 కోట్ల కంటే ఇది రూ. 100 కోట్లు ఎక్కువ.
రన్నరప్ జట్టు: రూ. 297 కోట్లు ($33M).
మూడో స్థానం: రూ. 261 కోట్లు ($29M).
నాలుగో స్థానం: రూ. 243 కోట్లు ($27M).
ఈసారి టోర్నీలో జట్ల సంఖ్య కూడా 32 నుంచి 48కి పెరిగింది. టోర్నీలో పాల్గొనే ప్రతి దేశానికి కనీస మొత్తాన్ని ఫిఫా హామీ ఇచ్చింది.
టోర్నీకి అర్హత సాధించిన ప్రతి జట్టుకు ‘ప్రిపరేషన్ ఖర్చుల’ కోసం 1.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 13.5 కోట్లు) అదనంగా ఇస్తారు.
గ్రూప్ స్టేజ్ నుంచి నిష్క్రమించే జట్లకు కూడా 9 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 81 కోట్లు) అందుతాయి. అంటే టోర్నీకి వెళ్లిన ప్రతి జట్టుకు కనీసం రూ. 95 కోట్లు లభించనున్నాయి.
2026 ప్రపంచకప్ అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. జూన్ 11 నుండి జూలై 19 వరకు ఈ మ్యాచులు జరగనున్నాయి. ఈసారి మరిన్ని జట్లు పాల్గొంటుండటం, ప్రైజ్ మనీ పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ క్రేజ్ మరింత పెరగనుంది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రీడా పోటీలలో ఒకటిగా ఫిఫా తన స్థానాన్ని మరోసారి చాటుకుంది. ముఖ్యంగా చిన్న దేశాలకు కూడా ఆర్థికంగా చేయూతనిచ్చేలా ఈసారి ప్రైజ్ మనీని రూపొందించడం విశేషం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..