
Navagraha Dosha Nivaran: జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలు (సూర్య, చంద్ర, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు) కి పెద్ద ప్రాధాన్యం ఉంది. జాతకంలోని ఏ ఒక్క గ్రహం అనుకూలించకపోతే అనారోగ్యం, ఆర్థిక సమస్యలు, కుటుంబ విఘాతం, విద్యా సమస్యలు మొదలైన సమస్యలు ఎదురవుతాయి. ఈ గ్రహ దోషాలను తొలగించడానికి, పరిహారాలు పాటించడం, ప్రత్యేక ఆలయాల్లో దర్శనం చేసుకోవడం అత్యంత సమర్థవంతం.
సూర్య గ్రహ దోషం ఉంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం అరిసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం, తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం, గొల్లలమామిడాడ సూర్యనారాయణ స్వామి ఆలయాలు, కర్నూలు జిల్లాలోని నందికొట్టూరు సూర్యనారాయణ స్వామి ఆలయం దర్శనం చేయడం ద్వారా సూర్య గ్రహ దోషాలు తొలగుతాయి.
చంద్ర గ్రహం బలహీనంగా ఉంటే మానసిక సమస్యలు, ఆవేశాలు పెరుగుతాయి. భీమవరం (పశ్చిమ గోదావరి) గునుగుపూడి సోమేశ్వర స్వామి ఆలయం, తూర్పుగోదావరి కోటిపల్లి సోమేశ్వరస్వామి ఆలయం, విజయవాడ కనకదుర్గాదేవి ఆలయం, కృష్ణా జిల్లా పెద్దకళ్ళే పల్లెలో దుర్గాదేవి ఆలయం, నెల్లూరు జొన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయం దర్శనంతో చంద్ర దోషాలు తొలగుతాయి.
కుజ గ్రహ దోషం ఉంటే వివాహం ఆలస్యం, సంతానం సమస్యలు కలుగుతాయి. ఈ సమస్యలకు పరిష్కారం: కృష్ణా జిల్లా మోపిదేవి సుబ్రమణ్య స్వామి ఆలయం, బిక్కవోలు సుబ్రమణ్య స్వామి ఆలయం, పెద్ద నందిపాడు, నాగులపాడు పుట్ట, పెద్దకూరపాడు పుట్ట, పొన్నూరు మంగళగిరి సుబ్రమణ్య స్వామి ఆలయం, యాదగిరిచ ధర్మపురి నృసింహక్షేత్రాలు ప్రత్యేకంగా కుజదోష నివారణకు ఫలవంతంగా ఉంటాయి.
బుధ గ్రహ దోషం ఉంటే చదువు, బుద్ధి సమస్యలు, ఆలోచనలో నెమ్మదితనం మొదలవుతుంది. పరిష్కారం: పశ్చిమ గోదావరి ద్వారకా తిరుమల ఆలయం, కోనసీమ ర్యాలీ కేశవ మోహిని జగన్నాథ స్వామి ఆలయం, పిఠాపురం కుంతీమాధవ స్వామి ఆలయం, కృష్ణా జిల్లా శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు ఆలయం, తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శించుకుంటే చాలు.
గురు గ్రహం అనుకూలంగా ఉంటే జీవితం విజయవంతంగా ఉంటుంది. దోషం ఉంటే సమస్యలు తలెత్తుతాయి. పరిష్కారం: గుంటూరు జిల్లా చెబ్రోలు బ్రహ్మ దేవుడు ఆలయం, అలంపురం బ్రహ్మదేవుని ఆలయం, కోటిపల్లి కోటిలింగేశ్వర స్వామి ఆలయం, మందపల్లిలో బ్రహ్మేశ్వర స్వామి ఆలయం, అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయం, కోటప్పకొండ త్రికూటేశ్వర స్వామి ఆలయం దర్శించుకోవాలి.
శుక్ర గ్రహ దోషం ఉంటే సంపద కలిగదు. పరిష్కారం: విశాఖపట్టణం కనకమహాలక్ష్మి ఆలయం, సింహాచలం లక్ష్మీ దేవి ఆలయం, అలిమేలు మంగాపురం, పద్మావతీ దేవి ఆలయం,
పెంచలకొన ఆదిలక్ష్మీ దేవి ఆలయం దర్శించుకుంటే శుక్రదోషాలు తొలగిపోతాయి.
శని గ్రహ దోషం ఉండే వారికి ఆర్థిక సమస్యలు, అప్పులు, అనారోగ్యం, కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి. పరిష్కారం: మందపల్లెలో మందేశ్వర స్వామి ఆలయం,
హిందుపురం తాలూకా పావగడ్ శని భగవానుని ఆలయం, విజయవాడ, కృష్ణా నది తీరంలో జ్యేష్ణదేవి సహిత శనైశ్చర్య స్వామి ఆలయం, ప్రకాశం జిల్లా సింగరాయ కొండ నర్సింగోలు శనైశ్వర స్వామి ఆలయం దర్శించుకోవాలి.
రాహు, కేతు అనుకూలించకపోతే అనాకాల మృతి భయాలు, అపమృతి దోషాలు ఉంటాయి. పరిష్కారం: చిత్తూరు శ్రీ కాళహస్తి ఆలయం, తూర్పుగోదావరి మండమల్లి నాగేశ్వర స్వామి ఆలయం, విజయవాడ కనకదుర్గాదేవి ఆలయం, విశాఖపట్టణం సంపత్ వినాయక స్వామి ఆలయం, గుంటూరు తెనాలి వైకుంఠపురం అమరావతి వినాయక స్వామి ఆలయం దర్శించుకుంటే ఈ దోషాలు తొలగిపోతాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న ఈ నవగ్రహాల ఆలయాలను దర్శించడం ద్వారా సకల గ్రహ దోషాలను ఉపశమనం చేయవచ్చు, జీవితం సౌభాగ్యం, సంపద, ఆరోగ్యంతో నింపబడుతుంది.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం హస్తసాముద్రిక శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)