కోలుకున్న వారికి మళ్లీ కరోనా.. శాస్త్రవేత్తలు ఏమన్నారంటే
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. అయితే దాదాపుగా అన్ని దేశాల్లో రికవరీ రేటు కూడా అధికంగా ఉండటం
Coronavirus re-infected cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. అయితే దాదాపుగా అన్ని దేశాల్లో రికవరీ రేటు కూడా అధికంగా ఉండటం ఇన్ని రోజులు కాస్త ఊరటను ఇచ్చింది. అయితే ఈ లోపే మరో బాంబు పడింది. ఈ వైరస్ సోకి కోలుకున్న వారిలో కొన్ని వారాల తరువాత మళ్లీ పాజిటివ్గా నిర్ధారణ అవుతోంది. దీంతో కరోనా మళ్లీ మళ్లీ సోకితే ఏమవుతామోనన్న భయం అందరిలో పెరుగుతోంది. అయితే ఈ విషయంపై శాస్త్రవేత్తలు స్పష్టతను ఇచ్చారు. కోలుకున్న వారికి మళ్లీ పాజిటివ్ రావడానికి వారి శరీరంలోని మృత వైరస్లేనని వారు చెబుతున్నారు.
రెండోసారి పాజిటివ్గా వచ్చిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించవని, వారి నుంచి ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. క్లినిక్ల్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ జర్నల్లో వారు ఈ వివరాలను వెల్లడించారు. కరోనా సోకిన వ్యక్తి శరీరం వేగంగా న్యూట్రలైజింగ్ యాంటీ బాడీలను విడుదల చేస్తుందని, కొన్ని వారాల తరువాత వారి సంఖ్య తగ్గిపోతుందని వారు తెలిపారు. ఇక శరీరం నుంచి వైరస్లను బయటకు పంపే ప్రక్రియ కొనసాగుతుండగానే కోలుకునే క్రమంలో పరీక్షల్లో పాజిటివ్గా వస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
”రెండవ సారి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన కేసులను ఇప్పుడిప్పుడే చూస్తున్నాము. రెండోసారి పాజిటివ్గా వచ్చిన వారిలో లక్షణాలు కనిపించలేదు” అని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్- ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ అన్నారు.
Read More: