ఎపీ, తెలంగాణ‌ మధ్య కొలిక్కిరానున్న ఆర్టీసీ చర్చలు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసుల పునరుద్ధరణ సమస్య ఎట్టకేలకు పరిష్కారం దొరికినట్లు కనిపించింది.

ఎపీ, తెలంగాణ‌ మధ్య కొలిక్కిరానున్న ఆర్టీసీ చర్చలు
Follow us

|

Updated on: Oct 22, 2020 | 7:09 AM

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసుల పునరుద్ధరణ సమస్య ఎట్టకేలకు పరిష్కారం దొరికినట్లు కనిపించింది. ఇందుకు సంబంధించి ఇరురాష్ట్రాల ఉన్నతాధికారుల మధ్య జరిగిన చర్చలు మరో మారు చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. అంతర్ రాష్ట్రాల మధ్య బస్సులను పునరుద్ధరించడం, రవాణా కొనసాగించటంపై ఎలాంటి నిర్ణయం లేకుండా అధికారులు మరోమారు చర్చల్లో మాట్లాడదాం అంటూ ముగించారు. చివరి మరో ప్రతిపాదనతో ఏపీఎస్ ఆర్టీసీ ముందుకు రావడంతో చర్చలు ఫలించేలా కనిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్స్ (ఆర్టీసీ) ఉన్నతాధికారుల మధ్య చర్చలు బుధవారం సాయంత్రం కూడా అస్పష్టంగానే ముగిశాయి . కిలోమీటర్లలో సమానత్వంతో పాటు రూట్లలో కూడా సమాన సర్వీసులు అనే అంశాన్ని తెలంగాణ అధికారులు చర్చించడంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. అయితే మరోసారి చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దసరాకు ముందు మరోమారు చర్చలు జరుగుతాయా లేదా అనేది కూడా సందిగ్ధమే . కరోనా మహమ్మారి కాలంలో ఇది ఐదో దఫా జరిగిన చర్చలు ఫలించలేదు.

ఎన్ని కిలోమీటర్లు బస్సులను నడపాలన్న దానిపైన ఇంతకు ముందు ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు భేటీలో చర్చల్లో పురోగతి సాధించినా మరోమారు తాజాగా జరిగిన చర్చల్లో మొత్తం 2.60 లక్షల కిలోమీటర్లకు 60 వేల తగ్గించుకుంటామని గతంలో చెప్పిన ఏపీ ఇప్పుడు మళ్ళీ మరో 40వేల కిలోమీటర్లు తగ్గించుకునేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అయితే, ఇందుకు తెలంగాణా అధికారులు తాజాగా లక్షా 60 వేల కిలోమీటర్లు తాము నడుపుకుంటామని, ఏపీ కూడా అదే విధంగా సమాన కిలోమీటర్లు నడపాలని ప్రతిపాదించింది. దీనిపై మళ్ళీ అలోచించి చెప్తామని ఏపీ ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు . దీంతో చర్చలు ఒక ముగింపుకు రాకుండానే ముగిశాయి. కాగా, తాజా ప్రతిపాదనలతో ఏపీఎస్ ఆర్టీసీ ముందుకు వచ్చింది. 1 లక్షా‌60 వేల కిలో మీటర్లకు రూట్ మ్యాప్ ను తెలంగాణా ఆర్టిసి అధికారులకు పంపింది. ఎట్టకేలకు 1 లక్షా 60 వేల కిలోమీటర్లకు మరో సారి రూట్ మ్యాప్ పంపింది ఎపిఎస్ ఆర్టిసి. రెండు, మూడు రోజుల్లో ఎపి, తెలంగాణా‌ మధ్య చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్ధీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.