మహారాష్ట్రలో ‘ రిసార్ట్ ‘ రాజకీయాలు.. ‘ మహా ‘ పీఠం ఎవరిదో ?

మహారాష్ట్రలో ‘ రిసార్ట్ రాజకీయాలు ‘ పుంజుకున్నాయి. గురువారం క్షణక్షణానికి పొలిటికల్ సీన్ మారుతూ వచ్చింది. ఉదయం కేంద్రమంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీ.. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని ప్రకటిస్తే.. కొద్దిసేపటికే.. శివసేన తన ‘ పట్టును ‘ మరింత బిగించింది. తమ ఎమ్మెల్యేలను ఎవరూ విడదీయలేరని సేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ప్రకటించిన కాసేపటికే.. పార్టీ చీఫ్ ఉధ్ధవ్ థాక్రే నివాసం ‘ మాతోశ్రీ ‘ కి కూతవేటు దూరంలో ఉన్న ‘ […]

మహారాష్ట్రలో ' రిసార్ట్ ' రాజకీయాలు.. ' మహా ' పీఠం ఎవరిదో ?
Follow us

|

Updated on: Nov 07, 2019 | 5:42 PM

మహారాష్ట్రలో ‘ రిసార్ట్ రాజకీయాలు ‘ పుంజుకున్నాయి. గురువారం క్షణక్షణానికి పొలిటికల్ సీన్ మారుతూ వచ్చింది. ఉదయం కేంద్రమంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీ.. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని ప్రకటిస్తే.. కొద్దిసేపటికే.. శివసేన తన ‘ పట్టును ‘ మరింత బిగించింది. తమ ఎమ్మెల్యేలను ఎవరూ విడదీయలేరని సేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ప్రకటించిన కాసేపటికే.. పార్టీ చీఫ్ ఉధ్ధవ్ థాక్రే నివాసం ‘ మాతోశ్రీ ‘ కి కూతవేటు దూరంలో ఉన్న ‘ రంగ్ శారద ‘ అనే హోటల్ కు వారిని తరలించారు. అంతకుముందు ఉధ్ధవ్ ఇంట్లో సమావేశమైన ఎమ్మెల్యేలంతా.. రొటేషన్ సీఎం పదవిపై వెనక్కు తగ్గరాదని, ఫడ్నవీస్ మళ్ళీ సీఎం కాకుండా చూడడానికి తమ పార్టీ అన్ని యత్నాలూ చేస్తుందని స్పష్టం చేశారు. ఇందుకు గల అవకాశాలనన్నింటినీ పార్టీ మూసివేసిందన్నారు. ఈ సభ్యులంతా బహుశా రెండు రోజులు రంగ్ శారద హోటల్లోనే ఉండవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో వీరంతా ఒకే చోట ఉండడం అవసరమని, ఉధ్ధవ్ థాక్రే ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అంతా కట్టుబడి ఉంటారని సేన ఎమ్మెల్యే సునీల్ ప్రభు అన్నారు. మరోవైపు.. గిరీష్ మహాజన్, చంద్రకాంత పాటిల్, సుధీర్ ముంగంటి వార్ వంటి బీజేపీ నేతలు ఈ మధ్యాహ్నం రాజ్ భవన్ లో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీతో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరిగిన పక్షంలో న్యాయ పరంగా తీసుకోవలసిన చర్యలపై ఆయనతో చర్చించినట్టు ఆ తరువాత వారు తెలిపారు. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తమ పార్టీ కోరుతోందని బీజేపీ నేత సుధీర్ ముంగంటి వార్ పునరుద్ఘాటించారు. మైనారిటీ సర్కార్ ని ఏర్పాటు చేయడానికి మీ పార్టీ యత్నిస్తుందా అన్న ప్రశ్నకు ఆయన.. అలాంటి యోచనేదీ లేదన్నారు.

అటు-శివసేనకు 56 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ నుంచి 105 మంది సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ రెండు పార్టీలను కలిపితే వీరి సంఖ్య 161 అవుతుంది. అప్పుడు మొత్తం 288 సీట్లున్న అసెంబ్లీలో ఈ కూటమికి క్లియర్ మెజారిటీ వఛ్చినట్టే.. కానీ ఈ రెండు పార్టీలూ ఎవరి మంకుపట్టు వారు పడుతుండడంతో ‘ లొల్లి ‘ ఎటూ తెగడంలేదు. ఈ నెల 9 తో అసెంబ్లీ కాల పరిమితి ముగుస్తుంది. ఆలోగా ఇది పరిష్కారం కాక పోతే రాష్ట్రపతి పాలనే దిక్కవుతుంది. కాగా-గత జులైలో కర్ణాటకలో కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీ-ఎస్ కూటమి ప్రభుత్వ పతనానికి దారి తీసిన రెబెల్ ఎమ్మెల్యేల వ్యవహారాన్ని ఈ సందర్భంగా నిపుణులు గుర్తు చేస్తున్నారు. వారిని బెంగుళూరు నుంచి ముంబైలోని హోటల్ కు తరలించడంతో బాటు , క్యాంపు రాజకీయాలకు తెర తీసిన బీజేపీ యత్నాలను వారు పేర్కొంటున్నారు. కొంతవరకు.. ఆ ‘ ఘటనలకు ‘ మహారాష్ట్రలోని ఈ తాజా ‘ ఘటనలకు ‘ ఉన్న పోలికలను ప్రస్తావిస్తున్నారు.