
ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్లో సత్తాచాటిన క్రీడాకారులను భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఘనంగా సత్కరించారు. ఒలింపిక్స్లో పోటీపడిన భారత క్రీడాకారులకు రాష్ట్రపతి తేనీటి విందు ఇచ్చారు. క్రీడాకారులను శనివారం రాష్ట్రపతి భవన్కు ఆహ్వానించిన ఆయన వారికి అభినందనలు తెలిపారు.

ఒలింపిక్ అథ్లెట్లను చూసి దేశం గర్వపడుతోందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. భారత ఒలింపిక్స్ చరిత్రలో ఈసారి అత్యధిక పతకాలు అందించారని వారిని ప్రశంసించారు.

మహిళా క్రీడాకారులపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అభినందనలు కురిపించారు. ‘ఈ విపత్కర పరిస్థితుల్లోనూ భారతావని సంబురాలు చేసుకునేలా చేశారు. ఎన్నో ఒడిదొడకులను ఎదుర్కొంటూ ప్రపంచస్థాయి ప్రదర్శన చేశారు. కొన్నిసార్లు గెలుస్తాం. మరికొన్నిసార్లు ఓడిపోతాం. కానీ ప్రతిసారీ కొత్త విషయాలను నేర్చుకొంటాం’ అని వ్యాఖ్యానించారు.

రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన తేనీటి విందుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, క్రీడాశాఖ మాజీ మంత్రి కిరణ్ రిజుజుతోపాటు పలువులు మంత్రులు పాల్గొన్నారు.

భారత ఒలింపిక్స్ చరిత్రలోనే భారత్ ఈసారి అత్యధికంగా ఏడు పతకాలు సాధించింది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. వెయిట్ లిఫ్టింగ్లో మీరాభాయి చాను, రెజ్లింగ్లో రవికుమార్ దహియా రజతం గెలుపొందారు. బ్యాడ్మింటన్లో పీవీ సింధు, బాక్సింగ్లో లవ్లీనా, రెజ్లర్ బజ్రంగ్ పునియా కాంస్య పతకాలు సాధించారు. భారత పురుషుల హాకీ జట్టు సైతం కాంస్యంతో మెరిసింది.

టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న భారత క్రీడాకారులను ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా నిర్వహించబోయే స్వాతంత్ర్య వేడుకలకు ప్రత్యేక అతిథులుగా ప్రధాని మోదీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. వీరితోపాటు వారి కోచ్లు, సపోర్ట్ స్టాఫ్, సాయ్, క్రీడా సమాఖ్య అధికారులను కూడా ఆహ్వానించారు. క్రీడాకారులందరినీ మోదీ వ్యక్తిగతంగా కలసి మాట్లాడనున్నట్టు అధికారులు తెలిపారు.