
Most Expensive Fish in World: సాధారణంగా నాణ్యమైన చేప ధర కేజీ కొన్ని వందలు లేదా వేలల్లో ఉంటుంది. టోక్యోలోని ప్రసిద్ధ టోయోసు మార్కెట్లో జరిగిన వేలంలో ఒకే ఒక్క చేప ఏకంగా రూ. 29 కోట్లకు అమ్ముడై ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ నీలిరెక్కల సూర (బ్లూఫిన్ ట్యూనా) చేపకు అంతటి ధర దక్కడం వెనుక ఉన్న ఆసక్తికర కథనం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

బంగారాన్ని మించిన విలువ.. కిలో రూ. 12 లక్షలు..: సముద్ర ఆహార ప్రియుల ప్రపంచంలో బ్లూఫిన్ ట్యూనా చేపకు ఉన్న క్రేజ్ వేరు. జపాన్ వేలంలో ఈ రాక్షస పరిమాణపు చేప కేజీ ధర సుమారు రూ. 12 లక్షల పలికింది. మన దేశంలో ఈ సొమ్ముతో ఒక లగ్జరీ కారును సునాయాసంగా సొంతం చేసుకోవచ్చు. 'సుషి సన్మాయ్' రెస్టారెంట్ నెట్వర్క్ అధినేత, ట్యూనా రాజాగా పేరుగాంచిన కియోషి కియోమురా ఈ భారీ ఆక్షన్లో అత్యధిక ధరకు దీనిని దక్కించుకున్నారు. 2019లో ఆయన రూ. 20 కోట్లకు పెట్టి కొనుగోలు చేసిన రికార్డును ఇప్పడు ఆయనే తిరగరాశారు.

నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే రుచి..: ఈ చేపకు అంతటి విలువ రావడానికి ప్రధాన కారణం దాని అద్భుతమైన రుచే. లోతైన, చల్లటి సముద్ర జలాల్లో వేలాది మైళ్లు ఈదే ఈ చేప మాంసం ఎంతో మెత్తగా, సహజ సిద్ధమైన కొవ్వుతో నిండి ఉంటుంది. ముఖ్యంగా దీని పొట్ట భాగంలో ఉండే 'ఓటోరో' అనే భాగం నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది. వయసు పెరిగే కొద్దీ ఈ చేప బరువు 450 కేజీలకు పైగా పెరుగుతుంది. బరువుతో పాటు మాంసంలో కొవ్వు శాతం పెరిగి రుచి మరింత దట్టంగా మారుతుంది.

దొరకడం అత్యంత కష్టం.. వేటకు కఠిన నిబంధనలు..: అగాధ సముద్రాల్లో వేగంగా ఈదే ఈ చేపలను పట్టుకోవడం ప్రాణాలతో చెలగాటమే. విచ్చలవిడిగా చేపల వేట పెరగడంతో సముద్రంలో వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రభుత్వాలు కూడా వేటపై కఠిన ఆంక్షలు విధించాయి. జపాన్లోని ఓమా తీరంలో స్థానిక జాలర్లు వలలు వాడకుండా సాంప్రదాయ 'తూండిల్' (గాలం) పద్ధతిలో ఒక్కో చేపను ఎంతో జాగ్రత్తగా పడతారు. దీనివల్ల చేపకు ఎలాంటి గాయాలు కావు. నాణ్యత తగ్గకుండా లభించే ఈ చేపలకు తీవ్రమైన కొరత ఉండటమే ధర ఆకాశాన్ని తాకడానికి కారణం.

రూ. 29 కోట్ల వెనుక దాగున్న వ్యాపార వ్యూహం..: ఒక్క చేప కోసం రూ. 29 కోట్లు ఖర్చు చేయడం పైకి నష్టదాయకంగా అనిపించినా, దీని వెనుక ప్రపంచస్థాయి ప్రచార వ్యూహం ఉంది. కొత్త సంవత్సరం మొదటి వేలంలో రూ. కోట్లు వెచ్చించి చేపను కొనుగోలు చేయడం ద్వారా ప్రపంచం దృష్టి మొత్తం సదరు రెస్టారెంట్ పైకి మళ్లుతుంది. ఉచితంగా లభించే ఈ అంతర్జాతీయ పబ్లిసిటీ విలువ కోట్లాది రూపాయల ప్రకటనల కంటే చాలా పెద్దది. మన దేశంలో మహారాష్ట్రకు చెందిన 'గోల్డ్ ఫిష్' (ఘోల్ చేప) లీటర్ల కొద్దీ ఔషధ గుణాలు ఉండి రూ. లక్షల్లో అమ్ముడవుతున్నప్పటికీ, జపాన్ ట్యూనా చేప రికార్డును ఏది దాటలేకపోయింది.