Toll Tax: సర్కార్ సంచలన నిర్ణయం.. కార్లు, ఎస్యూవీలకు టోల్ప్లాజాల్లో ఫ్రీ ఎంట్రీ
మహారాష్ట్రలో షిండే సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలో ప్రవేశించే కార్లు, ఎస్యూవీలకు టోల్ఫీజును రద్దు చేసింది. అయితే ఇది ఎన్నికల స్టంట్ అని విపక్షాలు మండి పడుతున్నాయి.. ఎన్నికలతో దీనికి సంబంధం లేదని, ప్రజలకు మేలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు షిండే.
అసెంబ్లీ ఎన్నికల వేళ మహారాష్ట్రలో షిండే సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ముంబై నగరంలోకి ప్రవేశించే.. లైట్ మోటార్ వాహనాలకు ఆ మార్గంలో ఉన్న టోల్ ప్లాజాల్లో టోల్ ఫీజులు వసూలు చేయబోమని ప్రకటించింది. కార్లు, ఎస్యూవీలకు.. సోమవారం అర్ధరాత్రి నుంచే టోల్ ఫీజులు వసూలు చేయబోమని తెలిపింది. ఇది వాహనదారులకు గుడ్న్యూస్గా చెప్పుకోవాలి. సీఎం ఏక్నాథ్ షిండే అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
టోల్ వసూళ్లకు వ్యతిరేకంగా ఆందోళనలు
థానే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఏక్నాథ్ షిండే.. గతంలో అనేక సార్లు టోల్ వసూళ్లకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ఇప్పుడు సీఎం పదవిలో ఉన్న షిండే టోల్ ఛార్జీలు వసూలు చేయడాన్ని ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏక్నాథ్ షిండే సర్కార్కు ఇదే చివరి కేబినెట్ భేటీ కావడంతో.. టోల్ ఛార్జీల రద్దుతోపాటు మరిన్ని నిర్ణయాలు తీసుకున్నారు.
“సర్కార్ తీసుకున్న నిర్ణయం ఎన్నికల స్టంట్ కాదు.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోలేదు. టోల్ఫీజును ఎన్నికల వరకే కాదు.. శాశ్వతంగా రద్దు చేశాం.. 10 కోట్ల 80 లక్షల మంది ఐదుమార్గాల్లో ప్రయాణం చేస్తారు.. దీనిపై విమర్శలు చేసిన వాళ్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మర్చిపోయిన చరిత్ర ఉంది. కర్నాటకలో కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చింది.. అధికారం లోకి వచ్చాక డబ్బులే లేవని ఎగ్గొట్టింది. హిమాచల్లో కూడా అనేక పథకాలను రద్దు చేశారు” మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్షిండే చెప్పారు.
5 టోల్ప్లాజాల దగ్గర టోల్ ఛార్జీల భారం తగ్గింపు
షిండే సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ముంబై నగరంలోకి వాహనాలకు వచ్చే 5 టోల్ప్లాజాల దగ్గర టోల్ ఛార్జీల భారం తగ్గనుంది. దహిసర్, ములుంద్, వాషి, ఐరోలి, తిన్హంత్ నాకా ప్రాంతాల్లో ఉన్న టోల్ ప్లాజాల నుంచి కార్లు, ఎస్యూవీలు ఎలాంటి టోల్ ఛార్జీలు చెల్లించకుండా దూసుకెళ్లిపోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం టోల్ ఫీజు రూ.45 వసూలు చేస్తున్నారు. ముంబై నగరంలోకి నిత్యం ప్రవేశించే చిన్న వాహనాలతో రోజువారీ ప్రయాణికులకు ఊరట కలిగిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
పొలిటికల్ స్టంట్ అంటూ విమర్శలు
టోల్ ఫీజులను రద్దు చేస్తూ ఏక్నాథ్ షిండే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఓట్ల కోసం చేసిన పొలిటికల్ స్టంట్ అంటూ మండిపడ్డాయి. మహారాష్ట్రలో ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని శివసేన ఉద్ధవ్ ఠాక్రే నేత ప్రియాంక చతుర్వేది ఆరోపించారు. ఇక మహారాష్ట్రతోపాటు జార్ఖండ్ అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈ వారంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలు ఉంది. నవంబర్ రెండు లేదా మూడో వారంలో ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..